మాకు ధోనీ ఉన్నాడు, కెసిఆర్ 'తెలంగాణ' కాదు: యాష్కీ
తమకు రాష్ట్ర ఏర్పాటు తప్ప ఎలాంటి ప్యాకేజీలు అవసరం లేదన్నారు. ఆత్మబలిదానాలను ప్యాకేజీలతో కొంటారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఏర్పాటు జరగకుంటేనే నక్సలిజం పెరుగుతుందన్నారు. ప్యాకేజీలతో తెలంగాణకు తాత్కాలిక ఉపశమనమే తప్ప సమస్యకు పరిష్కారం కాదన్నారు. లగడపాటి చెప్పినట్లుగా తెలంగాణ అడ్డుకునే బ్యాట్సుమన్ వారి వద్ద ఉంటే తమ వద్ద మహేంద్ర సింగ్ ధోనీలు ఉన్నారన్నారు. తమ పార్టీకి చెందిన ఎంపి అజహరుద్దీన్ హైదరాబాదుకు చెందిన వాడే అన్నారు.
జూలైలో లేదా ఆగస్టులో తెలంగాణ వస్తుందని తాను చెప్పానని, తనకు సంకేతాలు లేకుంటే చెప్పనన్నారు. తనకు ఎప్పుడు తప్పుడు సంకేతాలు రావన్నారు. కల్లిబొల్లి మాటలు చెప్పి రాజకీయం చేయనన్నారు. తెలంగాణ ప్రకటించాక సీమాంధ్ర నేతలు రాజీనామా చేసినా తమ పార్టీ అధిష్టానం భయపడదన్నారు. లగడపాటి బ్రహ్మాస్త్రానికి తమ వద్ద విరుగుడు ఉందన్నారు. సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దన్నారు. తెలంగాణ ఇచ్చాక వారెక్కడికి పోతారో వారిష్టమన్నారు.
గతంలో తెలంగాణపై ప్రకటన చేస్తే కెవిపి రామచంద్ర రావు, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డి తదితరులు అడ్డుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు వారు అడ్డుకున్నా ఆగే పరిస్థితి లేదన్నారు. రాజీనామాలు చేస్తే వాటిని ఎలా అడ్డుకోవాలో అధిష్టానానికి తెలుసన్నారు. పార్టీ లాభనష్టాలు బేరీజు వేసుకొని రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం లేదన్నారు. గతంలో సిడబ్ల్యుసి తెలంగాణను వ్యతిరేకించలేదన్నారు. ప్యాకేజీ వార్తలు విని భయపడొద్దన్నారు. తెలంగాణ ఏర్పాటుపై విధివిధానాలను పరిశీలిస్తోందన్నారు.
కెసిఆర్ కోరుకునే తెలంగాణ కాదు
కెసిఆర్ కోరుకుంటున్న దొరల తెలంగాణ రావడం లేదని, సామాజిక తెలంగాణ వస్తుందని యాష్కీ చెప్పారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇస్తుందంటే వారికి చలి జ్వరం పుడుతుందన్నారు. దొరా ఎందిరో అన్న వాళ్లతో కెసిఆర్ జై కొట్టించుకున్నారన్నారు. తెలంగాణవాదంతో దొరలు లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. అయితే ఆయన ఊహించినట్లుగా కాకుండా సామాజిక తెలంగాణను కాంగ్రెసు ఇస్తుందన్నారు. వివేక్, మందా జగన్నాథంలను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు.
కిరణ్ యు టర్న్: విహెచ్
రాష్ట్రంలో నక్సలైట్లే లేరని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జాతీయ భద్రతా మండలి సమావేశంలో చెప్పారని, ఇప్పుడు తెలంగాణను అడ్డుకునేందుకు తెలంగాణ సమస్యను తెర పైకి తీసుకు రావడమేమిటని రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు అన్నారు.