రాష్ట్ర విభజన: కిరణ్ రెడ్డిపై జైపాల్ రెడ్డి పైచేయి?
రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించే హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మంగళవారంనాడు జైపాల్ రెడ్డితో సమావేశమయ్యారు. అంతకు ముందు రోజు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ దాదాపు 40 నిమిషాల పాటు జైపాల్ రెడ్డితో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనకు ఎలా అడుగులు వేయాలనే విషయంపై అధిష్టానం పెద్దలు జైపాల్ రెడ్డి సలహాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర విభజన ఖాయమని వినిపిస్తున్న ప్రస్తుత తరుణంలో కీలకమైన నేతగా జైపాల్ రెడ్డి ముందుకు వచ్చారు. తెలంగాణ నాయకులు ఆయన చుట్టే తిరుగుతున్నారు. వారు కూడా ఆయన సలహాల మేరకే ముందుకు సాగుతున్నారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన జైపాల్ రెడ్డి గత ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. గత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డితో పడకపోవడం వల్లనే ఆయన నియోజకవర్గం మారాల్సి వచ్చినట్లు చెబుతారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరమ్ కుమార్ రెడ్డి కూడా జైపాల్ రెడ్డిపై కత్తులు నూరుతున్నారనే అభిప్రాయం బలంగా ఉంది.
అధిష్టానం పెద్దలతో తనకున్న సాన్నిహిత్యంతో గత కొద్ది వారాలుగా విస్తృతంగా చర్చలు జరిపి విభజనకు జైపాల్ రెడ్డి అంగీకరింపజేసినట్లు భావిస్తున్నారు. తెలంగాణ విషయంలో జైపాల్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మీద పైచేయి సాధించినట్లు చెబుతున్నారు. హైదరాబాదులో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు ఏకతాటి మీద నిలిచి తెలంగాణ సభను ఏర్పాటు చేయడం వెనక కూడా జైపాల్ రెడ్డి ప్రముఖమైన పాత్ర నిర్వహించినట్లు సమాచారం.