వరదలు: కేదార్నాథ్ విషాదం ఎలా? పగుళ్లు తప్ప భద్రం
ఉత్తర కాశీ, ముక్తేశ్వర్, నైనిటాల్ తదితర ప్రాంతాల్లో వరుసగా 2, 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. ఈ కారణంగానే భారీగా వరదలు వచ్చాయి. జాతీయ వాతావరణ విభాగం వారి కేంద్రాలు హిమాలయ పర్వతాల్లో 2000 మీటర్ల దిగువన మాత్రమే ఉన్నాయి. 3వేల మీటర్లు అంతకంటే ఎత్తున ఎలాంటి కేంద్రాలనూ ఏర్పాటు చేయలేదు. పవిత్ర చార్ధామ్ క్షేత్రాలు నాలుగు హిమాలయ పర్వత సానువుల్లో 3000 మీటర్ల ఎత్తుకు పైనే ఉన్నాయి.
అక్కడ ఎలాంటి కేంద్రాలు లేకపోవడం వల్లనే ఏం జరుగుతోంది? ఎంత వర్షపాతం నమోదైంది ఎవ్వరికీ తెలియలేదంటున్నారు. విపత్తు తీవ్రతను అంచనా వేసే అవకాశమూ రాలేదంటున్నారు. వెంటనే సహాయకచర్యలు చేపట్టే వీలూ లేకపోవడంతోనే మరణాల సంఖ్య వేలకు పెరిగింది. ఉత్తరాదిన రుతుపవనాలు సాధారణం కన్నా నెల రోజుల ముందే రావడం కూడా ఓ కారణమంటున్నారు. మరోవైపు జూన్ 30 నాటికి రుతు పవనాలు ఢిల్లీని తాకుతాయని వాతావరణ విభాగం ప్రకటించిన మరుసటి రోజే అంటే జూన్ 15కల్లా రుతుపవనాలు వ్యాపించాయి.
కేదార్నాథ్ ఆలయం కొలువై ఉన్న ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ముప్పు చాలా ఎక్కువగా ఉందని 1882లోనే సైంటిస్టులు హెచ్చరించారు. 1882లో జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు కేదార్నాథ్ ఫొటో ఒకటి తీశారు. దాంట్లో కేదార్నాథ్ ఆలయానికి సమీపంలో రెండు హిమనీ నదాలు ఉన్నాయి. అవి గనక కరిగి ప్రవహిస్తే ఆ ధాటికి కొట్టుకొచ్చే గండ శిలలు, విరిగిపడే కొండచరియలతో పెను ప్రమాదమని పేర్కొన్నారు.
మరోవైపు కేదార్నాథ్ ఆలయం మందాకినీ నది ప్రవాహమార్గానికి సరిగ్గా మధ్యలో ఉంటుంది. కొండల నుంచి ఆ క్షేత్రానికి ఉండే మార్గం వాలు చాలా ఎక్కువ. దీనివల్ల వరద నీరు అనూహ్య వేగంతో వచ్చి ఆలయం వద్దకు చేరుకుంటుందని అప్పట్లోనే ఆందోళన వ్యక్తమైంది. కాగా సాధారణంగా ఆలయాలు తూర్పు ముఖంగా ఉంటాయి. పడమటి ముఖంగా ఉండటమూ కద్దు. కానీ కేదార్నాథ్లోని జ్యోతిర్లింగ స్వరూపుడి ఆలయం దక్షిణాభిముఖంగా ఉండటం విశేషం.
ఇటీవలి విలయం బారి నుంచి తప్పించుకుని దృఢంగా నిలవడానికి ఈ ఆలయానికి అదే ఉపయోగంగా మారిందని జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఆలయం బయట కొద్దిగా క్రాక్స్ వచ్చినా ఎక్కడా ఏం కాలేదు. శతాబ్దాల నాటి ఆ పురాతన ఆలయాన్ని మున్ముందు ఇలాంటి ప్రమాదాల బారి నుంచి కాపాడుకొనేలా ఆ గుడి చుట్టూ రక్షణ కుడ్యాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు.