ఏకగ్రీవం: టీలో జగన్ అంతంతే, కెసిఆర్ జిల్లాలో కాంగ్రెసు
పంచాయతీ ఎన్నికలు పార్టీరహితంగానే జరుగుతున్నాయి. అయితే, గ్రామాల్లో సర్పంచ్ పదవులకు పోటీ పడుతున్న నాయకులు పార్టీ పేరు మీదనే ముందుకు వస్తున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచుల్లో 764 మంది కాంగ్రెసు పార్టీకి చెందినవారే. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు 548 పంచాయతీల్లో ఏకగ్రీవంగా సర్పంచులుగా ఎన్నికయ్యారు. జగన్ పార్టీకి 428 పంచాయితీలు పోటీలేకుండా దక్కాయి. టీఆర్ఎస్ మద్దతుదారులు 87 మంది ఏకగ్రీవంగా గెలుపొందగా, ఇతరులు 754 మంది ఉన్నారు.
ముఖ్యమంత్రి జిల్లాలో టిడిపిదే..
ముఖ్యమంత్రి కిరణ్, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు ఏకగ్రీవాల్లో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఏకంగా 308 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం కావడం గమనార్హం. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి 99 దక్కగా, వైయస్సార్ కాంగ్రెసుకు 75, కాంగ్రెస్కు 61 పంచాయితీలు వచ్చాయి. విశాఖపట్నం, తూర్పు గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ తెలుగుదేశం అగ్రస్థానంలో ఉంది.
కృష్ణా, ఖమ్మం, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఈ రెండు పార్టీలకు సమాన సంఖ్యలో పదవులు దక్కాయి. కడప, ప్రకాశం జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెసు మొదటి స్థానంలో నిలిచింది. నెల్లూరు, ఖమ్మం జిల్లాలో ఈ పార్టీ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో సమానంగా నిలవగలిగింది. నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ పార్టీ బోణీ కొట్టలేకపోయింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం మొదటి స్థానంలో నిలిచింది.
కెసిఆర్ సొంత జిల్లాలో కాంగ్రెసు
తెరాస అధినేత కె. చంద్రశేఖర రావు సొంత జిల్లా మెదక్లో కాంగ్రెస్ అగ్రస్థానంలో ఉండగా, తెరాస రెండో స్థానానికి పరిమితమైంది. ఖమ్మం, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఆ పార్టీకి ఏక సంఖ్యలో మాత్రమే ఏకగ్రీవాలు దక్కాయి. మెదక్, నల్లగొండ మినహా మిగిలిన అన్ని తెలంగాణ జిల్లాల్లో ప్రధాన పార్టీలకన్నా స్వతంత్రులకే ఎక్కువ గ్రామాలు దక్కాయి.
సర్పంచు, వార్డు సభ్యులందరు ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5.15 కోట్ల నజరానా విడుదల చేసింది. వేలంపాటలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఫలితాలను ఎన్నికల సంఘం నిలిపేసింది.