వైయస్-మద్యం రగడ: మతితప్పిందని బొత్సపై శోభ ఫైర్
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మద్యం తాగలేదా? అని షర్మిలను ఈ రోజు బొత్స ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీనిపై శోభా నాగి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ పైన విమర్శలు చేస్తే రాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. విజయనగరంలో షర్మిల పాదయాత్రకు భయపడిన బొత్స ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. జిల్లాలో వందల సంఖ్యలో బొత్సకు మద్యం దుకాణాలు ఉన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
మద్యం కేసులో తన పాత్ర ఎక్కడ బయటపడుతుందోనని రాత్రికి రాత్రే అధికారిని బదలీ చేయించారన్నారు. వైయస్ను, షర్మిలను విమర్శించే నైతిక అర్హత బొత్సకు, కాంగ్రెసుకు లేదన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన వైయస్ను విమర్శించడం దిగజారుడుతనమే అన్నారు. షర్మిలపై చేసిన విమర్శలను ఆయన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయమ్మ దీక్ష పైన విమర్శలు చేస్తున్న గండ్ర వెంకటరమణ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవని, విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్స్ అందుతున్నాయని చెప్పగలరా అని ప్రశ్నించారు.
బొత్స రాజకీయ బచ్చా అని గొల్ల బాబురావు అన్నారు. వైయస్ పైన, షర్మిల పైన బొత్స చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఢతకే వదిలేస్తున్నానని మైసూరా రెడ్డి అన్నారు. విజయమ్మ దీక్షను వక్రీకరించడం సరికాదన్నారు.
మద్యం డాన్ గొడవ
విజయనగరంలో పాదయాత్ర చేస్తున్న షర్మిల బొత్సను మద్యం డాన్గా పలుమార్లు అభివర్ణించారు. జిల్లాలో అన్ని మద్యం షాపులు ఆయన చేతిలోనే ఉన్నాయని షర్మిల ఆరోపించారు. దానిపై బొత్స ఈ రోజు పెదవి విప్పారు. ఒకింత ఘాటుగానే స్పందించారు. ఎవరో చెప్పిన మాటలతో తనను అనడం కాదంటూ.. సంవత్సరంలో నీ తండ్రి ఏ రోజు మందు తాగలేదని చెప్పగలవా అంటూ షర్మిలను ప్రశ్నించారు. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎదురుదాడికి దిగింది.