గుండెపోటుతో కోటగిరి విద్యాధర రావు ఆకస్మిక మృతి
కొద్ది రోజుల క్రితం ఆయన గుండెకు సంబంధించిన వ్యాధికి చికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది. కోటగిరి విద్యాధరరావు ఎన్టీ రామారావు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గాల్లో పనిచేశారు. ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో తొలిసారి 1994లో మంత్రి పదవి చేపట్టారు. ఆయన వ్యవసాయ శాఖను నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన భారీ పరిశ్రమల మంత్రిగా పనిచేశారు.
1983లో ఆయన శానససభకు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 1985 నుంచి 1999 వరకు వరుసగా ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన ఆ పార్టీలో చేరి కీలకమైన పాత్ర పోషించారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం కావడంతో ఆయన కాంగ్రెసు పార్టీ నాయకుడిగా ఉన్నారు.
కోటగిరి విద్యాధర రావు మృతికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన మృతికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సంతాపం ప్రకటించారు. కోటగిరి మరణవార్త తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి చిరంజీవి ఢిల్లీ నుంచి హుటాహుటిన బయలుదేరారు.