ఆకర్ష్: బిజెపి ఎమ్మెల్యేల అసంతృప్తి, జెడి(యు) గాలం?
దాదాపు ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ లీడర్, మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ పట్ల అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. వారు బిజెపిని వీడి జెడి(యు)కు జై కొట్టే అవకాశాలున్నాయంటున్నారు. ఇటీవలే సుశీల్ కుమార్ మోడీ పైన అసమ్మతి గళం వినిపించిన పార్టీ ఎమ్మెల్యే అమర్నాథ్ గామీ పైన బిజెపి అధిష్టానం ఆరేళ్ల పాటు సస్పెన్షన్ వేటు వేసింది.
తమ పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడి(యు) సర్కారు గాలం వేస్తోందని బిజెపి ఆరోపిస్తోంది. జెడి(యు) కూడా బిజెపి వ్యాఖ్యలను తిప్పి కొట్టింది. పార్టీ నాయకత్వంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, పది మందికి పైగా ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధపడుతుంజటంతో బిజెపిలో ఆందోళన ప్రారంభమైందని విమర్శించింది.
సుశీల్ కుమార్ మోడీ అధికార దాహంతో పార్టీని హైజాక్ చేశారని, నియంతృత్వంతో భజనపరులకే ప్రాధాన్యమిస్తున్నారని అమర్నాథ్ గామీ ధ్వజమెత్తారు. దీంతో ఆయనపై అధిష్టానం ఆరేళ్ల పాటు సస్పెన్షన్ వేటు వేసింది.
అమర్నాథ్ విలేకరులతో మాట్లాడుతూ... పన్నెండు మంది ఎమ్మెల్యేలు తన అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నారని, షోకాజ్ నోటీసైనా ఇవ్వకుండా సస్పెండ్ చేయడం ఏం ప్రజాస్వామిమని ఆయన ప్రశ్నించారు.