మిడ్డే మీల్ ట్రాజెడీ: ప్రిన్సిపాల్ ఇంట్లో పెస్టిసైడ్ ప్యాకెట్స్
చాప్రా: బీహార్ మధ్యాహ్న భోజనం విషాద సంఘటనలో విభ్రాంతికరమైన విషయం వెలుగు చూసింది. పాఠశాల ప్రిన్సిపాల్ మీనా దేవి ఇంటి నుంచి పోలీసులు క్రిమిసంహారక మందుల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులకు పెట్టిన మధ్యాహ్న భోజనంలో విషతుల్యమైన క్రిమిసంహారక మందులున్నాయని ఫోరెన్సిక్ నివేదిక శనివారం బయటపెట్టింది.
ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ సమర్పించిన నివేదిక వివరాలను అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ రవీందర్ కుమార్ మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. పాత్ర నుంచి సేకరించిన నూనెలో, మిగిలిపోయిన ఆహారంలో, కూరగాయల్లో ఆర్గానోఫాస్పరస్ మిశ్రమం మోనోక్రోటోఫాస్ ఉన్నట్లు తేలింది.
వ్యవసాయ పంటలకు మోనోక్రోటోఫాస్ వాడుతారు. మనుషులకు, పశువులకు అది అత్యంత ప్రమాదకరమైందని రవీందర్ కుమార్ చెప్పారు. చాప్రాలోని ధర్మసతి గండమాన్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పెట్టిన ఆహారంలో విషం కలిపి ఉండవచ్చుననే బీహార్ ప్రభుత్వ వాదనను ఫోరెన్సిక్ నివేదిక సమర్థిస్తోంది.
మిడ్డే మీల్స్ తిని 23 మంది పిల్లలు మరణించినప్పటి నుంచి స్కూల్ ప్రిన్సిపాల్ మీనాదేవి కనిపించకుండా పోయింది. ఆమె పోలీసులకు లొంగిపోతారనే ప్రచారం సాగుతోంది. ప్రభుత్వాన్ని దెబ్బ తీయడానికి ప్రతిపక్షాల కుట్రలో భాగంగానే ఈ విషాద సంఘటన చోటు చేసుకుని ఉంటుందని అధికార జెడి (యు) విమర్శిస్తోంది.
మధ్యాహ్న భోజనం వండడానికి వాడిన సరుకులన్నీ మీనాదేవి భర్త అర్జున్ రాయ్ నడిపే దుకాణం నుంచే తెచ్చినట్లు బీహార్ విద్యాశాఖ మంత్రి పికె సాహీ చెప్పారు. ఇందులో కుట్ర ఉందా అని అడిగితే రాయ్ ప్రతిపక్ష పార్టీకి చెందినవాడని జవాబిచ్చారు. ఆహారంలో ఆర్గోనో ఫాస్పరస్ కలిపారని సాహి చెప్పారు. పరారీలో ఉన్న పాఠశాల ప్రిన్సిపాల్, ఇతర టీచర్ల కోసం గాలింపు జరుగుతోంది.
ఇదిలావుంటే, ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం ఓ వాణిజ్య ప్రకటన చేసింది. పాఠశాలల్లో పిల్లలకు పెట్టే ఆహారాన్ని పాఠశాలల ప్రన్నిపాల్స్, వంటవాళ్లు ముందు రుచి చూడాలని ఆదేశించింది. ఆకస్మిక తనిఖీలు నిర్వహించే విద్యాశాఖ పర్యవేక్షకులు కూడా ఆ ఆహారాన్ని రుచి చూస్తారని తెలిపింది.