హోటల్లో రాంచీ ఆర్జే స్నేహసింగ్ మృతి, రేప్ అనుమానం
రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీ పట్టణంలోని తొలి రేడియో ఆర్జే స్నేహా సింగ్ మృతి చెందింది. ఆమె బీహార్ రాష్ట్రం ముంగార్ జిల్లాలోని ఓ హోటల్ గదిలో ఫ్యానుకు వేలాడుతూ బుధవారం కనిపించింది. స్నేహా సింగ్ వయస్సు 25. రాంచీ పట్టణంలో స్నేహా పాపులర్ రేడియో జాకీ(ఆర్జే).
2008 నుండి 2010 మధ్యలో ఆమె పాపులర్ అయ్యారు. హెచ్టి సమాచారం మేరకు... రాంచీలోని సెయింట్ గ్జావియర్స్ కళాశాలలో ఎంబియే పూర్తి చేసిన అనంతరం స్నేహ గత కొన్ని నెలలుగా బీహార్ రాష్ట్రంలోని జీవిక అనే ఎన్జీవో సంస్థతో కలిసి పని చేస్తున్నారు.
ఈ రోజు ఆమె మృతదేహాన్ని పోలీసులు ఓ హోటల్ గదిలో కొనుగొన్నారు. గది నెంబర్ 101లో ఉన్న ఆమె మృతదేహం అర్ధ నగ్నంగా ఉంది. దీంతో పోలీసులు ఆమెది ఆత్మహత్యగా కాకుండా హత్య లేదా అత్యాచార హత్యగా అనుమానిస్తున్నారు.
ఏం జరిగిందనేది పోస్టుమార్టం రిపోర్టు అనంతరమే తెలుస్తుందని ముంగార్ సూపరింటెండెట్ పోలీసు నవీన్ చంద్ర ఝా చెప్పారు. ఫోరెన్సిక్ నిపుణులు పూర్తి ఆధారాలు సేకరించారు. కేసు ప్రస్తుతం దర్యాఫ్తులో ఉంది.
కాగా మృతికి ముందు స్నేహా సింగ్ తన మొబైల్ నుండి సన్నిహితులతో గంటకు పైగా మాట్లాడినట్లు పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.