జగన్ చెవిలో టి హీట్!: మరో రాజీనామా, ఒత్తిడేవల్లేనా?
పదిహేను రోజుల క్రితం కడప జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి, శ్రీనివాసాలు, ఒక ఎమ్మెల్సీ రాజీనామా చేసినా అది చల్లారిపోయింది. ఈ రోజు అదే జిల్లాకు చెందిన కమలాపురం కాంగ్రెసు పార్టీ శాసన సభ్యుడు వీరశివా రెడ్డి రాజీనామా చేశారు. సీమాంధ్ర మంత్రులు సమైక్యాంధ్ర కోసం భేటీలు జరుపుతున్నారు. ఢిల్లీ వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో విభజన పోరులో వెనుకబడతామనే ఒత్తిడితోనే జగన్ పార్టీ కూడా రాజీనామాల వేడిని రాజేసినట్లుగా కనిపిస్తోందంటున్నారు.
తెలంగాణకు అనుకూలంగా జోరుగా ప్రచారం సాగుతుండటంతో ఈ రోజు వీరశివా రాజీనామా చేసిన వెంటనే బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేశారు. తమ పార్టీ నేతల రాజీనామాలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డి, ఇతర నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జగన్ పార్టీ విభజన లొల్లి ప్రారంభమైంది. ఈ విషయాన్ని జగన్ చెవిలో వేసినట్లుగా తెలుస్తోంది.
గుర్నాథ్ రెడ్డి రాజీనామా
మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనంతపురం ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెసు పార్టీ వైఖరికి నిరసనగా రాజీనామాలు చేస్తున్నట్లు చెప్పారు. మొదట కాంగ్రెసు వైఖరి చెప్పాలని, ఆ తర్వాతే సంప్రదింపులు జరపాలని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడవద్దని చెబుతున్నారు. రాజీనామా బాటలో పార్టీకి చెందిన మరికొందరు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది.