విజయమ్మ మినహా జగన్పార్టీ ఎమ్మెల్యేల రాజీనామా
గుర్నాథ్ రెడ్డి(అనంతపురం), బాలినేని శ్రీనివాస్ రెడ్డి(ఒంగోలు), శోభా నాగి రెడ్డి(ఆళ్లగడ్డ), మేకపాటి చంద్రశేఖర రెడ్డి(ఉదయగిరి), నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి(నెల్లూరు), అమర్నాథ్ రెడ్డి(రాజంపేట), శ్రీకాంత్ రెడ్డి(రాయచోటి)లు రాజీనామా చేశారు. వారు స్పీకర్ ఫార్మాట్లో తమ రాజీనామాలను ఫ్యాక్స్ చేశారు. విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ వైఖరి చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజనను కాంగ్రెసు పార్టీ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా కాకుండా రాజకీయంగా ఆలోచిస్తోందని బాలినేని విమర్శించారు. రాష్ట్ర బాగోగులను ఆ పార్టీ పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ ఇస్తే ఎన్ని సీట్లు వస్తాయి, రాయల - తెలంగాణ ఇస్తే ఎన్ని సీట్లు వస్తాయనే ఆలోచిస్తోందన్నారు. ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్రాన్ని విభజించాలనుకుంటున్నట్లుగా ఉందని మండిపడ్డారు. స్వార్థంతోనే కాంగ్రెసు పార్టీ తెలంగాణవాదాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. అందరికీ ఆమోదయోగ్య పరిష్కారమార్గాన్ని కనుగొనాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజీనామాల్లో ట్విస్ట్
రాష్ట్ర విభజనపై కాంగ్రెసు వైఖరి తెలుపాలంటూ రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల లేఖలు స్పీకర్ కార్యాలయానికి చేరలేదు.
వ్యక్తిగతం: గట్టు
సమైక్యాంధ్ర కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేల రాజీనామా వారి వ్యక్తిగతమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గట్టు రామచంద్ర రావు అన్నారు. రాష్ట్ర విభజన పైన కాంగ్రెసు పార్టీ ముందు తన వైఖరి ప్రకటిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. అధికార పార్టీ డబుల్ గేమ్ ఆడుతోందని మండిపడ్డారు.
రాజీనామా చేయండి: ఓయు జెఏసి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు తెలంగాణ అడ్డుకునేందుకు రాజీనామా పర్వానికి తెరలేపారని ఉస్మానియా విశ్వవిద్యాలయ జెఏసి ఆరోపించింది. తెలంగాణ ప్రాంత జగన్ పార్టీ నేతలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.