జగన్ పార్టీ తీరు: టీ నేతల గుండెల్లో రాయి (పిక్చర్స్)
హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర శానససభ్యుల తీరుతో ఆ పార్టీ తెలంగాణ నేతల గుండెల్లో రాయి పడినట్లయింది. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం వైఖరికి నిరసనగా సీమాంధ్రకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ఒక్కరొక్కరే రాజీనామా చేస్తున్నారు. ఇది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ నేతలకు మింగుడు పడడం లేదు.
తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని చెబుతూ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామనే పద్దతిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. కానీ, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వెలువడుతుందనే సంకేతాలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో రాజీనామాల బాట బట్టారు.
తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ చెబుతూ వస్తున్న తెలంగాణ నాయకులకు ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు తెలంగాణకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి మాత్రమే రాజీనామాలపై స్పందించారు. సీమాంధ్ర శాసనసభ్యుల రాజీనామాలను ఆయన వ్యతిరేకించారు. కేంద్ర నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పార్టీ ఇప్పటి వరకు చెబుతూ వచ్చిందని, ఇప్పుడు రాజీనామాలు చేయడం సరి కాదని ఆయన అన్నారు.
కొండా సురేఖ ఏమంటారు..
వైయస్ జగన్పై అలిగి పార్టీకి కొంత కాలం దూరంగా ఉండి మళ్లీ దగ్గరైన కొండా సురేఖ తెలంగాణ విషయంలో సీమాంధ్ర శానససభ్యుల తీరుపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తి కలిగించే విషయం. తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా లేదని, తాము అనుకూలమని స్పష్టం చేశామని ఆమె ఇంత కాలం చెబుకుంటూ వచ్చారు. తాజా పరిణామం ఆమెను ఇబ్బంది పెట్టే విషయమే. తెలంగాణకు తాము అనుకూలమని అంటూ ఆమె తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కెసిఆర్పై మాటల ఈటెలు రువ్వుతూ వచ్చారు.
కరుడు గట్టిన తెలంగాణవాది..
కరీంనగర్ జిల్లా సిరిసిల్ల శాసనసభా నియోజకవర్గానికి చెందిన కెకె మహేందర్ రెడ్డి మొదటి నుంచి కరుడు గట్టిన తెలంగాణవాది. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో ఏర్పడిన విభేదాల వల్ల ఆయన ఇరకాటంలో పడినట్లే కనిపిస్తున్నారు.
కెసిఆర్తో పడకనే ఇలా..
తెరాస అధ్యక్షుడు కెసిఆర్తో పొసగకపోవడం వల్లనే మాజీ శాసనసభ్యుడు కొమ్మూరి ప్రతాప రెడ్డి బయటకు వచ్చారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. వరంగల్ జిల్లా జనగాం శానససభా నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్న ఈయన తాజా పరిణామం నేపథ్యంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
పక్కా తెలంగాణవాది..
నల్లగొండ జిల్లా భువనగిరి శానససభా నియోజకవర్గానికి చెందిన జిట్టా బాలకృష్ణా రెడ్డి గత ఎన్నికల్లో తెరాస టికెట్ లభించకపోవడంతో బయటకు వచ్చారు. ఆయన తెలంగాణవాదం బలపడడానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణవాదాన్ని మొదటి నుంచీ వినిపిస్తున్న నేత. ప్రస్తుతం తమ పార్టీ సీమాంధ్ర నాయకులు చేస్తున్న రాజీనామాలపై ఆయన ఘాటుగానే స్పందించారు. వారి తీరును ఆయన వ్యతిరేకించారు.
బాజిరెడ్డి గోవర్దన్ ఏం చెబుతారు...
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి బాజిరెడ్డి గోవర్దన్ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ అంశంపై సీమాంధ్ర నాయకులు వ్యవహరిస్తున్న తీరుకు ఆయన ఏం చెబుతారనేది కూడా ఆసక్తికరంగానే మారింది. తెలంగాణకు వైయస్ జగన్ వ్యతిరేకం కాదని, తెలంగాణ అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిందేనని ఆయన చెబుతూ వచ్చారు. కేంద్రం నిర్ణయం తీసుకునే దశలో సీమాంధ్ర నాయకుల తీరుపై ఆయన ఏమంటారో చూడాలి.