టి: ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా, నమ్మలేమని కెసిఆర్
ముఖ్యమంత్రితో మంత్రుల భేటీ
ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర మంత్రులు ఉదయం భేటీ అయ్యారు. టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, కాసు వెంకటకృష్ణా రెడ్డి, మహీధర్ రెడ్డిలు కిరణ్తో ఎపి భవన్లో సమావేశమయ్యారు.
ప్రత్యేక రాష్ట్రం వచ్చే వరకు నమ్మలేం: కెసిఆర్
ప్రత్యేక రాష్ట్రంతోనే తెలంగాణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని, రాష్ట్రం కూడా సస్యశ్యామలం అవుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం మెదక్ జిల్లాలోని తన ఫాం హౌస్లో అన్నారు. ఆయనను గెలిచిన పలువురు సర్పంచులు కలిశారు. తెలంగాణపై ఢిల్లీలో ఎప్పుడో నిర్ణయం జరిగినట్లు తనకు సిగ్నల్స్ వచ్చాయని, కానీ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించే వరకు కాంగ్రెస్ పార్టీని నమ్మలేమని చెప్పారు.
రాష్ట్రం ఏర్పడిన మూడు సంవత్సరాలలో తెలంగాణను సస్యశ్యామలం చేయనున్నామన్నారు. ఇందుకోసం ఇరిగేషన్ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. తాను పుట్టిన గడ్డ మెదక్ జిల్లా, రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన సిద్దిపేట రుణం తీర్చుకుంటానని చెప్పారు.
అస్పష్టమైన పార్టీ: గండ్ర
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక అస్పష్టమైన పార్టీ అని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి వరంగల్లో అన్నారు. ఆ పార్టీకి రాష్ట్ర విభజన అంశంపై స్పష్టమైన వైఖరి లేదని, కేవలం ప్రజలను గందరగోళంలోకి నెట్టడానికే నేతలు రాజీనామాలకు తెర లేపారని ఆయన చెప్పారు. రాజీనామాలతో, వచ్చే తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరని ఆయన తెలిపారు.