జెండాలు కాల్చండి: జగన్ పార్టీపై ఓయు జెఏసి నిప్పులు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన పదహారు మంది శాసన సభ్యులు విభజన విషయంలో కాంగ్రెసు వైఖరి చెప్పాలని డిమాండ్ చేస్తూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ ప్రాంత నేతలు, జెఏసిలు తీవ్రంగా స్పందించాయి. తెలంగాణను అడ్డుకోవడానికే రాజీనామాలకు తెర తీశారని ఓయు జెఏసి నేతలు ఆరోపించింది.
ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ దిష్టి బొమ్మలను దహనం చేయాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హబ్సిగూడలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జెండాను కూల్చివేశారు.
అడుగు పెట్టనివ్వం: తెలంగాణ నేతలు
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను అడ్డుకోవద్దంటూ సీమాంధ్ర నేతలకు తెలంగాణ కాంగ్రెస్నేతల విజ్ఞప్తి చేశారు. అన్నదమ్ముల్లా విడిపోయి కలిసుందామని సూచించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును అడ్డుకునేవారిని క్షమించబోమని వారు హెచ్చరించారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను అడ్డుకుంటే సీమాంధ్ర నేతలతోపాటు సిఎం, బొత్సలను సైతం తెలంగాణలో అడుగుపెట్టనివ్వమని వారు హెచ్చరించారు. తెలంగాణ అంశంపై అధిష్ఠానం నిర్ణయానికి అందరమూ కట్టుబడదామని సమాచార శాఖ మంత్రి డీకే అరుణ హైదరాబాద్లో అన్నారు. ఈ విషయంలో అందరమూ సంయమనం పాటిద్దామన్నారు. తెలంగాణ విషయంలో తమకు అధిష్ఠానం, సోనియాలపై పూర్తి నమ్మకముందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. తెలంగాణ ఏర్పడితే నక్సలిజం పెరుగుతుందడనడం సరికాదని కేంద్ర మంత్రి బలరాం నాయక్ అన్నారు. నక్సలైట్లు మన సోదరులో అన్నారు.