సీమాంధ్ర భేటీలో చిరంజీవి, కెవిపి: జగన్ భేటీకి నేతలు
శోభా నాగి రెడ్డి ఫైర్
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూనే తాము రాజీనామాలు చేశామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆళ్లగడ్డ శాసన సభ్యులు శోభా నాగి రెడ్డి శుక్రవారం కర్నూలులో చెప్పారు. రాష్ట్ర విభజన వ్యవహారం కాంగ్రెసు పార్టీ తన సొంతింటి వ్యవహారంలా చూస్తోందని విమర్శించారు. విభజన పేరుతో తెలుగువారి ఆత్మాభిమానాన్ని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని ఆమె మండిపడ్డారు. సోనియా ప్రజల మనోభావాలను గుర్తించాలన్నారు.
విజయమ్మతో భేటీ
ఎమ్మెల్యేల రాజీనామాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ నేతలు కెకె మహేందర్ రెడ్డి, విజయా రెడ్డిలు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మతో భేటీ అయ్యారు.
జగన్ను కలువనున్న నేతలు
అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీకి చెందిన నేతలు కలుసుకోనున్నారు. పార్టీలోని రాజీనామాల వేడిని ఆయన దృష్టికి తీసుకు వెళ్లనున్నారు. ఏం చేయాలనే దానిపై చర్చించనున్నారు. అలాగే అవనిగడ్డ ఏకగ్రీవానికి సహకరించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ రాసిన నేపథ్యంలో దానిని కూడా జగన్ దృష్టికి తీసుకు వెళ్లనున్నారు.