టీపై 29న యుపిఎ భేటీ: చేతులెత్తేసిన సిఎం కిరణ్ రెడ్డి
న్యూఢిల్లీ/ హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెసు నాయకత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) సమన్వయ కమిటీ సమావేశం ఈ నెల 29వ తేదీన జరిగే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశంలో కాంగ్రెసు పార్టీ తెలంగాణపై చర్చించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. యుపిఎ సమన్వయ కమిటీ సమావేశం తర్వాతనే కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28వ తేదీన సిడబ్ల్యుసి సమావేశం జరుగుతుందని భావిస్తున్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెసు అధిష్టానం వ్యూహం మార్చుకున్నట్లు తెలుస్తోంది. యుపిఎ భాగస్వామ్య పార్టీల పూర్తి మద్దతు లభిస్తుందని భావించిన తర్వాత సిడబ్ల్యుసిలో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే ఆలోచనతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద, ఆగస్టు 5వ తేదీలోగా రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకునే దిశలోనే సాగుతున్నట్లు చెబుతున్నారు.
ఇదిలావుంటే, రాష్ట్ర విభజన ఖాయమని సంకేతాలు అందుతున్న నేపథ్యంలో సీమాంధ్ర మంత్రులు శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. విభజన జరుగుతుందనే ఉద్దేశంతో తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోవద్దని కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర మంత్రులకు చెప్పినట్లు తెలుస్తోంది. అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుందామని, అందరం కలిసే నిర్ణయం తీసుకుందామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
తెలంగాణపై పార్టీ అధిష్టానం ఏం చేస్తుందో చూద్దామని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానానికి చెప్పాల్సిందంతా చెప్పామని, డాక్యుమెంట్లూ ఆధారాలు ఇచ్చామని, ఏం నిర్ణయం చేస్తుందో చూద్దామని ఆయన సీమాంధ్ర మంత్రులతో అన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పరిణామాలను ముఖ్యమంత్రికి వివరించామని సీమాంధ్ర మంత్రి బాలరాజు చెప్పారు. రాజీనామాలు చేయడం సహా అన్ని విషయాలపై చర్చిస్తున్నామని ఆయన చెప్పారు. దీన్నిబట్టి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన విషయంలో చేతులెత్తేసినట్లు చెబుతున్నారు.
అనుమానాలను నివృత్తి చేశాం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం అనుమానాలను నివృత్తి చేశామని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. త్వరలోనే రాష్ట్ర విభజనపై ప్రకటన వస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ వస్తుందన్న ఆశాభావంతో ఉన్నామని ఆయన అన్నారు. ఢిల్లీ పర్యటనను ముగించుకుని ఆయన హైదరాబాద్ వచ్చారు.