బాబు, జగన్ రాహుకేతువులు: విభజనపై వీరశివా
రాష్ట్రాన్ని విభజిస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసు భూస్థాపితం అవుతుందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. చీమూనెత్తురు ఉంటే సీమాంధ్ర నాయకులు సమైక్యవాదాన్ని వినిపించాలని, లేదంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఆయన అన్నారు. సమైక్యవాదం వినిపించని మంత్రులు, పార్లమెంటు సభ్యులను, శాసనసభ్యులను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే కాంగ్రెసుకు 20 లోకసభ స్థానాలను సాధించి పెడుతామని ఆయన చెప్పారు.
ఇదిలావుంటే, రాష్ట్ర విభజన ప్రయత్నాలను నిరసిస్తూ విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు ఆదివారంనాడు హైదరాబాదులోని తెలుగుతల్లి విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు. జై ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. తెలుగుజాతిని విభజించడానికి అంగీకరించబోమని విశాలాంధ్ర మహాసభ నాయకుడు పరకాల ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా లక్షమందితో నవంబర్ 1వ తేదీన హైదరాబాద్లో బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
ఆగస్టు 4వ తేదీన విశాలాంధ్ర మహాసభ సమావేశం జరగనుంది. రాష్ట్రాన్ని విభజన దిశగా రాజకీయ శక్తులను తీసుకుని వెళ్తున్నాయని, ఆ శక్తులను ఆపడానికి తగిన బలాన్ని ఇవ్వాలని తెలుగుతల్లి ఆశీస్సులు తీసుకుంటున్నామని ప్రభాకర్ అన్నారు. తెలుగు జాతి సమైక్యతను కాపాడడానికి నడం బిగించని పార్టీలు, నాయకత్వాలు తెలుగుతల్లి శాపానికి గురువుతాయని ఆయన వ్యాఖ్యానించారు.