వైకాపా పార్టీయే కాదు, మాట్లాడ్డం దండుగ: విహెచ్
తెలంగాణపై నిజమైన కాంగ్రెసువాదులు పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. మంత్రి పదవుల కోసం సోనియా గాంధీ కావాలని, క్లిష్ట సమయంలో సోనియా గాంధీ మాటను గౌరవించరని ఆయన సీమాంధ్ర నాయకులను ఉద్దేశించి అంటున్నారు. అన్నదమ్ముల్లా కలిసి ఉందామని ఆంధ్ర నాయకులు అంటున్నారని, తమ్ముడు చనిపోతుంటే మాట్లాడడం లేదని ఆయన అన్నారు. తెలంగాణలో 900 మంది ఆత్మహత్య చేసుకున్నా ఎందుకు అలా చేసుకుంటున్నారని ఆంధ్ర నాయకులు ఒక్కసారి కూడా ఆలోచించలేదని ఆయన అన్నారు. కనీసం మానవతా దృక్పథంతోనైనా ఆలోచించాలి కదా అని ఆయన అన్నారు.
తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలపై ఆంధ్ర నాయకులు మజాక్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణను అడ్డుకోవద్దని చెబుతున్నామని, అధిష్టానానికి సహకరించాలని కోరుతున్నామని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన గురించి జాతీయ మీడియాలోనూ సంకేతాలు వస్తున్నాయని ఆయన చెప్పారు. రాయల తెలంగాణ ప్రతిపాదన వచ్చిందని, రాయల తెలంగాణ కావాలని కొందరు అడిగారని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
తమకు పాత తెలంగాణ ప్రాంతం మాత్రమే కావాలని అడిగామని, 1956కు ముందున్న రాష్ట్ర పునరుద్ధరణ మాత్రమే జరగాలని తాను అధిష్టానానికి చెప్పానని ఆయన అన్నారు. రాయలసీమకు సంబంధించిన రెండు జిల్లాలను తెలంగాణలో కలిపినప్పుడు తాను మీడియాను పిలిచి మాట్లాడుతానని ఆయన అన్నారు. తమకు తెలంగాణ కావాలని, ఆంధ్ర నాయకులు అడ్డుకోవద్దని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పడితే నక్సలైట్లు పెరుగుతారనేది ఊహాగానం మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు.
రాష్ట్రాన్ని విభజిస్తే రాజీనామాలు చేస్తామని రాష్ట్ర మంత్రులు కొందరు, రాజకీయాలను వదులుకుంటామని కొంత మంది పార్లమెంటు సభ్యులు అంటున్నారని, తెలంగాణను అడ్డుకోవడానికి వారంటున్న ఈ మాటలు సరి కాదని ఆయన అన్నారు.
తెలంగాణపై ఆగస్టు 15 డెడ్లైన్
ప్రత్యేక తెలంగాణ రాష్ట ప్రకటనపై ఆగస్టు 15 వరకు డెడ్లైన్ విధిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చెప్పారు. ఆదివారం హైదరాబాద్ నగరంలో తెలంగాణపై జరిగిన కమ్యూనిస్టుల రాష్ట్ర సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. చర్చల పేరుతో కాంగ్రెస్ మరోసారి కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు.
వచ్చేనేల 15 లోపల తెలంగాణపై ప్రకటన చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యయం చేపడతామని నారాయణ హెచ్చరించారు. హైదరాబాద్తో కూడిన 10 జిల్లాల తెలంగాణ కావాలని, ఇంక దేనికి ఒప్పుకునేది లేదని నారాయణ స్పష్టం చేసారు. తెలంగాణ ఇవ్వకపోతే ఊహించని రీతిలో ఉద్యమం ఉంటుందని ఆయన మరోసారి కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తెలంగాణపై పూటకో మాట
ప్రత్యేక తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పూటకొక మాట చెబుతూ రాష్ట్ర ప్రజలను గందరగోళంలోకి నెడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కాంగ్రెస్ నమ్మదగిన పార్టీ కాదని, స్వలాభం కోసం కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తుందని విమర్శించారు. ఉద్యమాల కాలం అయిపోయిందని, ఇప్పుడు నిర్ణయాల కాలం వచ్చిందని రాఘవులు అన్నారు. తెలంగాణ అంశాన్ని పార్లమెంట్లో పెట్టి తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.