టిడిపి సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య: గాలిలోకి కాల్పులు
శనివారం జరిగిన రెండోదవ పోలింగ్ కౌంటింగ్ సందర్భంగా సిఐ శ్రీరామ్ తెలుగుదేశం పార్టీకి చెందిన పోలింగ్ ఏజంట్ల మీద దురుసుగా ప్రవర్తించి, భయపెట్టారని, సర్పంచ్ అభ్యర్థి అయిన వెంకట రత్నంపై కూడా అసభ్య పదజాలంతో దూషించారని, దాంతో విరక్తి చెందిన వెంకటరత్నం ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకుందని గ్రామప్రజలు తెలిపారు.
సీఐపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తూ వెంకటరత్నం మృతదేహంతో ఆదివారం ఉదయం దర్శిలో ఊరేగిస్తూ ఆందోళన నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులపై లాఠీచార్జీ చేశారు. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. భాష్పవాయు ప్రయోగం చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.
పది ఓట్ల తేడాతో వెంకటరత్నం గెలిచినట్లు మొదటి ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు రీకౌంటింగ్ను కోరారు. రీకౌంటింగ్ చేసిన అధికారులు 8 ఓట్ల తేడాతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారు గెలిచినట్లు ప్రకటించారు. దీంతో వెంకటరత్నం ఓటమి పాలైనట్లు తేలింది.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో విజయనగరం జిల్లాలోని గొర్ల మండలం చంద్రంపేటలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్ వర్గీయుల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిని విజయనగరం ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.
అలాగే విశాఖ జిల్లా భీమిలి మండలం సింగనబండలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. దాడుల్లో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులను భారీగా మోహరించారు.