31న యుపిఎ మీట్: తెలుగు మీడియాకు ఆజాద్
ఇందులో భాగంగానే ఈ నెల 29వ తేదీన యుపిఎ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుందని శనివారం వార్తలు వచ్చాయి. కానీ, ఈ నెల 31వ తేదీన సమావేశం జరగనున్నట్లు తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. తెలంగాణపై యుపిఎ సమన్వయ కమిటీలో చర్చించిన తర్వాత కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశం జరగవచ్చునని చెబుతున్నారు. తెలంగాణపై సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఇదిలా వుంటే, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, మాజీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ గులాం నబీ అజాద్ ఆంధ్రప్రదేశ్ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రతినిధులను ఆదివారం ఆయన ఆహ్వానించారు. తెలంగాణపై ఆయన కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
రాష్ట్ర విభజనపై సంప్రదింపులు పూర్తవడంతో కాంగ్రెస్, యుపిఎ ప్రభుత్వం తమ వైఖరులను వెల్లడించాల్సివుంది. ఈ నేపథ్యంలో ఆజాద్ ఏం చెబుతారోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. రాష్ట్ర విభజన విషయంలో ఇటీవలి వరకు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీగా పనిచేసిన ఆజాద్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.