హక్కులేదు: టిపై జయప్రకాశ్, జగన్ని నమ్మొద్దని మల్లు
2004, 2009 ఎన్నికల ప్రణాళికలలో తెలంగాణ ఇస్తామని పేర్కొలేదన్నారు. విభజన నిర్ణయం తీసుకోనున్న కాంగ్రెస్ కోర్ కమిటీలోగాని, వర్కింగ్ కమిటీలోగాని రాష్ట్రానికి చెందిన తెలుగువారు ఒక్కరు కూడా లేరన్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానంలో ఆంధ్రప్రదేశ్ నుండి ఎవరూ లేరని, అలాంటి అధిష్టానం విభజనపై నిర్ణయం తీసుకోవడం న్యాయబద్దం కాదన్నారు.
విభజన వద్దు: తోట
రాష్ట్రాన్ని విభజిస్తే అరాచక శక్తులు ప్రబలిపోతాయని మంత్రి తోట నరసింహం రాజమండ్రిలో అన్నారు. ఛత్తీస్గఢ్ వంటి చిన్న రాష్ట్రాల్లో పెద్ద నేతలకు కూడా భద్రత లేదని, రాష్ట్రంలో అటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకే సమైక్యంగా ఉండాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఏపీ ఎన్జీవోల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
సిఎం సమైక్యవాదే: ఆనం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదేనని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. పార్టీ అధిష్ఠానానికి కిరణ్ ఇచ్చింది రోడ్డు మ్యాప్ కాదని, విభజనలో భాగస్వామిని చేయవద్దని ఆయన అధిష్ఠానానికి తెలిపారని నెల్లూరులో వివరించారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం లేదన్నందువల్లే తెలంగాణ ఉద్యమానికి బలం చేకూరిందన్నారు. రాష్ట్రం రెండు ముక్కలవడానికి వీళ్లే కారణమన్నారు.
సోనియా ఇచ్చేందుకు సిద్ధం: దామోదర
తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సిద్ధంగా ఉన్నారని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆదివారం తనను కలిసిన ఓయూ జెఏసి విద్యార్థులకు ఈ విషయం చెప్పారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని, తెలంగాణ ఇచ్చేవిధంగానే సోనియా వైఖరి ఉందని, ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితుల గురించి ఆమె అడిగి తెలుసుకున్నారని, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా నిర్ణయం తీసుకునేలా కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందని రాజనర్సింహ చెప్పారు.
జగన్ను నమ్మి మోసపోవద్దు: మల్లు రమేష్
సమైక్యవాదం వినిపిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి ఆ పార్టీ తెలంగాణ నాయకులు బయటకు రావాలని భారత్ ఏక్తా ఆందోళన్ జాతీయ కన్వీనర్ మల్లు రమేష్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశా రు. నాడు పార్లమెంట్లో ప్లకార్డులు పట్టుకుని జగన్ తన నైజాన్ని తెలియజేస్తే, ఆ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు సమైక్య నినాదంతో రాజీనామా చేసి ఆ పార్టీ అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పారన్నారు. ఆ పార్టీ నేతల మాటలు నమ్మొద్దన్నారు.
రాయల తెలంగాణ ఓకే: బలరాం
తెలంగాణ రాష్ట్రం నిర్మాణం ఖరారైయిందని, 2014కల్లా ఈ ప్రక్రియ పూర్తవుతుందని కేంద్ర మంత్రి బల్రాంనాయక్ వెల్లడించారు. సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్, రాహుల్, తెలంగాణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. అధిష్ఠానం రాయల తెలంగాణ ఇచ్చినా, తెలంగాణ ఇచ్చినా తాము కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు.