టి-నేతల విజ్ఞప్తి: బాబు, జగన్ ఓ లైన్ రాసివ్వాలని టిజి
న్యూఢిల్లీ/హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా అనుకూలంగా నిర్ణయం తీసుకునే సమయంలో సీమాంధ్ర నేతలు అడ్డుకోవద్దని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు సోమవారం అన్నారు. సీమాంధ్ర నేతలు విద్యార్థులకు డబ్బులిచ్చి ఉద్యమాలను నడిపిస్తున్నారని ఆరోపించారు. పార్టీ అధిష్టానం నిర్ణయం తెలంగాణకు అనుకూలంగా ఉంటుందన్నారు. కీలక సమయంలో సీమాంధ్ర నేతలు సహకరించాలని కోరారు.
సమస్యను పరిష్కరించే క్రమంలో మరో సమస్య ఉత్పన్నం కాకుండా చూడాల్సి ఉందని సనత్ నగర్ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. తెలంగాణపై ఓవర్ నైట్ డిసిషన్ తీసుకోదని తాము భావిస్తున్నామని మంత్రి టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డిలు అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ ప్రాంతానికి చెందిన నేతలే అన్నారు. వారు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఒక లైన్ రాసిస్తే చాలన్నారు. వారిని తాను గెడ్డం పట్టుకొని అడుగుతున్నానన్నారు. తాను సమైక్యవాదిని అని, విభజన అనివార్యమైతే రాయలసీమ హక్కుల గురించి మాట్లాడుతానని చెప్పారు.
హనుమంత రావు
తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వెలువడుతున్న సమయంలో సీమాంధ్ర నేతలు అడ్డుకోవద్దని, పార్టీ అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు అన్నారు.
టిజి వెంకటేష్, ఏరాసు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని ఒక లైన్ రాసిస్తే చాలని, తాము లాబియింగ్ చేసి రాష్ట్రం విడిపోకుండా చేస్తామని మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డిలు అన్నారు.
హరీష్ రావు
సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యల వెనుక చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారని తెరాస సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అనుమానాలు వ్యక్తం చేశారు. ములాయంను బాబు మేనేజ్ చేసినట్లుగా కనిపిస్తోందన్నారు.
రాజీనామా చేయండి: వీరశివా రెడ్డి
సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తూ కేంద్రమంత్రులకు, పార్లమెంటు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయాలని కమలాపురం కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే వీరశివా రెడ్డి అన్నారు. ఇప్పటికీ వారు స్పందించకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. రేపు సీమాంధ్ర ప్రజాప్రతినిధులం ఢిల్లీ వెళ్తున్నామని, అధిష్టానంపై ఒత్తిడి తీసుకు వస్తామన్నారు.
వెంకయ్య నాయుడు
తెలంగాణ అంశంపై కాంగ్రెసు పార్టీ కావాలని కొన్ని రకాల లీకులిస్తోందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఆరోపించారు. తమకు ఏది ఎక్కువ లాభమో తెలుసుకునేందుకే ఇదంతా చేస్తోందని, కాంగ్రెసు వ్యవహారంతో ప్రజల మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసు, కేంద్రం వైఖరి స్పష్టమైన తర్వాత స్పందిస్తామన్నారు. తెలంగాణ కోసం బిల్లు పెడితే బిజెపి మద్దతిస్తుందన్నారు.