తెలంగాణ ఏర్పాటు, పదేళ్లు హైద్రాబాద్ ఉమ్మడి రాజధాని
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, హైదరాబాదును పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కాంగ్రెసు పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోందని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ మంగళవారం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిడబ్ల్యూసి విజ్ఞప్తి చేసిందన్నారు. విస్తృత సంప్రదింపుల అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆంధ్రా, రాయలసీమ ప్రాంత ప్రజల ఆందోళనలు తగ్గించేందుకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు.
సోనియా అధ్యక్షతన కాంగ్రెసు వర్కింక్ కమిటీ భేటీ అయిందని చెప్పారు. పోలవరం జాతీయ హోదా, పూర్తి చేసేందుకు తగిన నిధులు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. పదేళ్ల పాటు హైదరాబాదు నుండి రెండు రాష్ట్రాల పాలన కొనసాగుతుందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు రాజ్యాంగపరమైన ప్రక్రియ ప్రారంభించాలని కోరామన్నారు. సిడబ్ల్యూసి భేటీ అనంతరం అజయ్ మాకెన్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ విలేకరులతో మాట్లాడారు.
సంప్రదింపులు, చర్చల తర్వాతే తెలంగాణపై ఈ నిర్ణయానికి వచ్చామని దిగ్విజయ్ చెప్పారు. నదీ జలాలు, విద్యుత్, ఇతర మౌలికాసదుపాయల పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పదేళ్లలో సీమాంధ్రకు కొత్త రాజధానిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రక్రియకు నాలుగు నుండి ఐదు నెలల సమయం పట్టవచ్చునని చెప్పారు. సీమాంధ్రుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచుతున్నట్లు చెప్పారు.
ఎన్నికలతో సంబంధం లేదు, చిన్న రాష్ట్రాలతో పోల్చొద్దు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎన్నికలతో సంబంధం లేదని డిగ్గీ చెప్పారు. తీర్మానానికి రాజకీయ కారణం లేదన్నారు. రాష్ట్ర విభజన తీర్మానాన్ని కేంద్రం శాసన సభకు పంపుతుందని, అసెంబ్లీలో తీర్మానం ఎలా ఉన్నప్పటికీ పార్లమెంటులో బిల్లు పెడతామన్నారు. హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణకు కాంగ్రెసు ఆమోదం తెలుపబోతుందని తాను నిన్నననే చెప్పానన్నారు. కాంగ్రెసు చారిత్రక నిర్ణయం తీసుకుందన్నారు. చిన్న రాష్ట్రాలతో తెలంగాణ అంశం పోల్చవద్దు.
న్యాయమంత్రిత్వ శాఖ బిల్లు రూపొందిస్తుందన్నారు. న్యాయశాఖ రూపొందించిన బిల్లును మళ్లీ శాసన సభకు పంపిస్తామన్నారు. శాసన సభ తీర్మానాన్ని కేంద్ర హోంశాఖ కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. హోంశాఖ రూపొందించిన తుది ముసాయిదాపై పార్లమెంటులో చర్చ అనంతరం కేంద్రం ఆమోదించి రాష్ట్రపతికి పంపిస్తుందని చెప్పారు. శాసనసభ తీర్మానం కోసం ఉపసంఘాన్ని నియమిస్తామన్నారు.
టిఆర్ఎస్ విలీనంపై....
తెలంగాణ రాష్ట్ర సమితి విలీనం విషయమై ఆ పార్టీ నిర్ణయం కోసం తాము వేచి చూస్తున్నామని దిగ్విజయ్ సింగ్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ పేరుతో సీమాంధ్ర..
సీమాంధ్ర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉంటుందని చెప్పారు.