చివరి క్షణందాకా: పురంధేశ్వరి, మీసాలున్నా: బాపిరాజు
న్యూఢిల్లీ: తనకు మీసాలున్నా, తెలంగాణ ఆపే దమ్ము లేదని కాంగ్రెసు పార్టీ సీనియర్ పార్లమెంటు సభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కనుమూరి బాపిరాజు, విభజనపై నిర్ణయం అయిపోయిందని తాము భావించడం లేదని కేంద్రమంత్రి పురంధేశ్వరి, రాజకీయ సన్యాసంపై కట్టుబడి ఉన్నానని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు.
కనుమూరి బాపిరాజు నివాసంలో సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మంగళవారం భేటీ అయ్యారు. ఈరోజు సాయంత్రం యూపిఏ, సిడబ్ల్యూసి సమావేశం జరుగనుంది. ఇందులో తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో సమైక్యం కోసం ఒత్తిడి తెచ్చేందుకు ఎంపీలు, నేతలు కనుమూరి ఇంట్లో భేటీ అయ్యారు.
భేటీ అనంతరం కనుమూరి మాట్లాడుతూ... తనకు మీసాలున్నాయని, తెలంగాణ ఆపే దమ్ము మాత్రం లేదని వ్యాఖ్యానించారు. 2014 సాధారణ ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.
చివరి క్షణం వరకు...
విభజనపై నిర్ణయం జరిగిపోయిందని తాము భావించడం లేదని, చివరి క్షణం వరకు సమైక్యాంధ్ర కోసం ప్రయత్నాలు చేస్తామని కేంద్రమంత్రి, విశాఖపట్నం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మంగళవారం న్యూఢిల్లీలో అన్నారు.
మీసాలున్నా దమ్ము లేదు
తనకు మీసాలున్నప్పటికీ తెలంగాణను ఆపే దమ్ములేదని కాంగ్రెసు పార్టీ సీనియర్ పార్లమెంటు సభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. ఆయన నివాసంలో సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు ఈ రోజు భేటీ అయ్యారు.
మాటపై నిలబడతా
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. 2014లో సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
సమైక్యమే...
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నామని మంత్రి కొండ్రు మురళి హైదరాబాదులో అన్నారు. రాష్ట్ర విభజన జరిగిపోయిందని తాను భావించడం లేదని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి, సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు.
హెచ్చరికలు
రాష్ట్ర విభజన జరిగితే తాము సీమాంధ్ర నేతలను తరిమి కొడతామని సమైక్యాంధ్ర నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ రోజు తెలంగాణపై నిర్ణయం ప్రకటించనున్నారనే వార్తల నేపథ్యంలో సీమాంధ్రలో భారీగా బలగాలను మోహరించారు. కేంద్రమంత్రులు చిరంజీవి, కిల్లి కృపారాణి, ఎంపీల, రాష్ట్ర మంత్రులు, ఇతర నేతల ఇళ్లకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.