త్రిమూర్తుల సమక్షంలో టి ప్రకటన, 'రాయల'కు విష్ణు నో
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణల సమక్షంలో తెలంగాణపై ఓ ప్రకటన చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఆ ముగ్గురు నేతలను అధిష్టానం పిలిచిందంటున్నారు.
ఆ ముగ్గురు నేతల నుండి ఇప్పటికే అధిష్టానం రోడ్ మ్యాప్ తీసుకుంది. అదే సమయంలో తెలంగాణపై నిర్ణయం కూడా తీసేసుకుందని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు యూపిఏ భాగస్వామ్య పక్షాల భేటీ, ఐదున్నర గంటలకు సిడబ్ల్యూసి భేటీ జరగనుంది.
ఆ భేటీ అనంతరం రాష్ట్రానికి చెందిన ముగ్గురు నేతల సమక్షంలో తెలంగాణపై అధిష్టానం ఓ ప్రకటన చేయనుందని చెబుతున్నారు. అధిష్టానం దాదాపు తెలంగాణకు అనుకూలంగానే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణ ఇవ్వనుందంటున్నారు.
త్రిమూర్తుల సమక్షంలో...
కాంగ్రెసు పార్టీ అధిష్టానం కాంగ్రెసు పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణల సమక్షంలో తెలంగాణపై ఓ ప్రకటన చేసేందుకు సిద్ధమైంది. బొత్స ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. కిరణ్ బయలుదేరనున్నారు.
ఢిల్లీకి దామోదర
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు సుదర్శన్ రెడ్డి, శ్రీధర్ బాబు, జానా రెడ్డి, డికె అరుణ, ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి తదితర తెలంగాణ నేతలు మంగళవారం ఉదయం ఢిల్లీ బయలుదేరారు.
విష్ణు
రాయల తెలంగాణను అంగీకరించే ప్రసక్తి లేదని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, కాంగ్రెసు నేత విష్ణువర్ధన్ రెడ్డి సోమవారం అన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ కోరుకుంటున్నానని, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ఒప్పుకోమని చెప్పారు.
గజ్జెల కాంతం
రాయల తెలంగాణను తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అడ్డుకుంటే తాము తరిమి కొడతామని తెలంగాణ ప్రజా సంఘాల ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ గజ్జెల కాంతం హెచ్చరించారు. ఆరు దశాబ్దాల పోరాటాల ఫలితంగా తెలంగాణ సాకారమవుతోందన్నారు. సోమవారం గజ్జెల కాంతం, ఇతర నేతలు డిప్యూటీ సిఎంను కలిశారు.
ఓయు విద్యార్థి సంఘం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు ఆ పార్టీకి రాజీనామాలు చేసి బయటకు రావాలని తెలంగాణ విద్యార్థి ఐక్యకార్యాచరణ సమితి, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్యకార్యాచరణ సమితి పిలుపునిచ్చింది. మాజీ మంత్రి కొండా సురేఖ ఆ పార్టీకి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
రాయపాటి సాంబశివ రావు
కాంగ్రెస్ అధిష్ఠాన తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తానని గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివ రావు స్పష్టం చేశారు. ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. రాష్ట్ర విభజనపై అధిష్ఠానం ప్రజల నాడిని తెలుసుకుంటుందన్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం రాదన్నారు. ఒకవేళ రాష్రాన్ని విభజించాల్సి వస్తే హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.