సొంత పార్టీపై ఎంపీ అనంత మండిపాటు, టిడిపి సవాల్
సీమాంధ్రుల వల్లనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. తెలుగు ప్రజలను అన్ని పార్టీలు మోసం చేశాయన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను కూడా గుర్తించాలన్నారు. నలభై ఏళ్ల క్రితమే రాష్ట్రాన్ని విభజించి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదన్నారు. విభజన యత్నం విరమించుకోవాలన్నారు. నేతలమంతా ఏకతాటి పైన ఉన్నామన్నారు. రేపటిలోగా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి విలీనం అవుతుందని కాంగ్రెసు ఇలాంటి నిర్ణయం తీసుకుందా అని ప్రశ్నించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఎన్ని జరిగినా డిసెంబర్ 9 ప్రకటన నాటి ఆలోచన ధోరణిలోనే కాంగ్రెసు అధిష్టానం ఉందని, ఇప్పటికీ మించిపోయింది లేదన్నారు. అన్ని పార్టీలు కూడా కాంగ్రెసు యూ టర్న్ తీసుకునేలా ఒత్తిడి తేవాలన్నారు.
సోమిరెడ్డి సవాల్
కాంగ్రెసు పార్టీ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమైక్య లేఖ ఇస్తే విభజనను అడ్డుకుంటామని చెబుతున్న సీమాంధ్ర కాంగ్రెసు నేతలకు ఆయన సవాల్ విసిరారు. మొదట ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమైక్య లేఖ ఇప్పిస్తే, ఐదు నిమిషాల్లో తాము బాబుతో ఇప్పిస్తామన్నారు.