మాకేమిచ్చారు?: కాటసాని, జగన్ అవకాశవాది: సాకె
జగన్, బాబుల వల్లే: శైలజానాథ్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీది అవకాశవాదమని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు సిగ్గు చేటని మంత్రి శైలజానాథ్ అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తాము స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేస్తామన్నారు. ఇప్పుడు రాజకీయం కోసం సమైక్యమంటున్న జగన్ పార్టీ, నాడు అఖిల పక్ష సమావేశంలో ఏం చెప్పిందో గుర్తు చేసుకోవాలన్నారు. తెలంగాణకు అనుకూలమని చెప్పి బాబు రాష్ట్రాన్ని ముక్కలు చేశారన్నారు. తెలంగాణపై ప్రాసెస్ ప్రారంభమైందని, ఆపేందుకు తాము ప్రయత్నాలు చేస్తామన్నారు.
ఇప్పుడే రాజీనామా: శిల్ప
తాను, కాటసాని రాంభూపాల్ రెడ్డి, లబ్బి వెంకట స్వామిలం ఇప్పుడే రాజీనామా చేస్తున్నామని శిల్పా మోహన్ రెడ్డి చెప్పారు. స్పీకర్ను కలిసి రాజీనామా చేసేందుకు సిద్దమయ్యామన్నారు. తాము ప్రస్తుతం పదవులకు చేస్తున్నామని, పార్టీకి చేయాలా లేదా అనేది నిర్ణయించుకుంటామన్నారు.
రాజకీయ కారణాలతోనే: పార్థసారథి
కేవలం రాజకీయ కారణాలతోనే రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని మంత్రి పార్థసారథి అన్నారు. తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. తాను అందరికంటే ముందే రాజీనామా చేశానని, మిగిలిన వారు కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని కడప జిల్లా ఆదినారాయణ రెడ్డి అన్నారు.
కాగా సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు చంద్రబాబు, జగన్ను టార్గెట్ చేసుకున్నారు. అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు ఎమ్మెల్యే జెసి దివాకర్ రెడ్డి, మంత్రులు టిజి వెంకటేష్, పార్థసారథి, శైలజానాథ్ తదితరులు అందరూ రాష్ట్రం ముక్కలు కావడానికి చంద్రబాబే, జగనే కారణమని ఆరోపించారు.