'ఎవడు'పై చిరంజీవికి అల్టిమేటం, స్పీకర్కు సమైక్య సెగ
చిత్తూరు జిల్లాలో మంత్రి గల్లా అరుణ కుమారి ఫ్యాక్టరీ బస్సు పైన సమైక్యవాదులు దాడి చేశారు. టిడిపి నేత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఇంటిని ముట్టడించి, రాజీనామా చేయాలని పట్టుబట్టారు. సినీ నటి తమన్నకు సమైక్య సెగ తగిలింది. విశాఖ విమానాశ్రయంలో ఆమెను అడ్డుకున్నారు. గుడివాడలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొడాలి నాని ఆందోళన చేపట్టారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇంటిని సమైక్యవాదులు ముట్టడించారు. విభజన నిర్ణయం నేపథ్యంలో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సీమాంధ్ర నేతలతో చర్చిస్తున్నాం
అసంతృప్తిగా ఉన్న సీమాంధ్ర నేతలతో తాము చర్చిస్తున్నామని ఏఐసిసి కార్యదర్శి ఆర్సీ కుంతియా హైదరాబాదులో అన్నారు. సీమాంధ్రకు సంబంధించి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటామని వివరించారు. సీమాంధ్ర నేతలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల విగ్రహాలను ధ్వంసం చేయవద్దని కోరారు. తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణపై సిడబ్ల్యూసి వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు.
విగ్రహాలపై దాడిని ఖండించిన కిరణ్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీవ్, ఇందిర విగ్రహాల పైన దాడిని ఖండించారు. సిఎస్, డిజిపిలతో ఆయన ఫోన్లో పర్యవేక్షించారు. ప్రయివేటు, ప్రభుత్వ ఆస్తులను ఆందోళనకారులు ధ్వంసం చేయవద్దని, జాతీయ నేతల విగ్రహాలకు నిప్పు పెట్టవద్దని కోరారు. విధ్వంసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు. ఉద్యమంలో అసాంఘిక శక్తులు చొరబడకుండా చూడాలని డిజిపిని ఆదేశించారు.