సరదాగా వ్యాఖ్యానిస్తే...: క్షమాపణ చెప్పనన్న శోభా డే
ముంబైని మహారాష్ట్ర నుంచి వేరు చేయాలని తాను సూచించలేదని, ట్విట్టర్లో తాను పొందుపర్చిన వ్యాఖ్యలను అర్థం చేసుకోకుండా క్షమాపణలు చెప్పాలని పట్టుబడితే పట్టించుకోనన్నారు. సరదాగా వ్యాఖ్యానిస్తే ఇలా స్పందిస్తారనుకోలేదని, దిన పత్రికలలో విషయం చూసి ఆశ్చర్యపోయానన్నారు. తాను ఎవరి మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించలేదన్నారు. కాబట్టి క్షమపణ అడిగే ప్రశ్నే తలెత్తదన్నారు.
మద్యం మత్తులో మాట్లాడుతోంది
శోభా వ్యాఖ్యలపై శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆందోళనలను తీవ్రం చేశాయి. ఆమె మద్యం మత్తులో మాట్లాడుతోందని మండిపడ్డారు. ఆమెను అరెస్టు చేయాలని శివసేన డిమాండ్ చేసింది.
ముంబైని విడదీయడమంటే విడాకులు తీసుకున్నంత తేలికేమీ కాదని ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ థాకరే ఎద్దేవా చేశారు. ఆమె క్షమాపణ చెప్పాల్సిందేనని, లేదంటే తమ ఆందోళన మరింత తీవ్రతరమవుతుందని హెచ్చరించారు. శోభా డే వ్యాఖ్యలు సరికాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అన్నారు.