ప్రజలతో కలిసి పోరాడేందుకే రాజీనామా: టిజి వెంకటేష్
కర్నూలు/ హైదరాబాద్: సమైక్యాంధ్ర కోసం ప్రజలతో కలిసి పోరాడేందుకే తాను రాజీనామా చేసినట్లు రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ స్పష్టం చేశారు. శనివారంనాడు ఆయన కర్నూలులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నికర జలాలను తెలంగాణవారు ఉంచుకుని వరద నీటిని సీమ ప్రజలకు ఇవ్వడం అన్యాయమని ఆయన అన్నారు.
రాయలసీమ గురించి పట్టించుకునే నాయకులు తెలంగాణ, కోస్తాలోనే కాదు, తమ ప్రాంతంలో కూడా లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ఆజ్యం పోసినవారి విగ్రహాలను వదిలేసి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పాటుపడిన నేతల విగ్రహాలను కూల్చడం సబబు కాదని ఆయన అన్నారు. తాను ఎప్పటికీ సమైక్యవాదినే అని, అందుకోసం జనంతో కలిసి పోరాటం చేస్తానని టిజి వెంకటేష్ చెప్పారు.

తెలంగాణలోని ఆంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన ప్రకటనపై తెలుగుదేశం నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునే విషయంలో తనను సంప్రదించలేదనే కోపంతోనే కెసిఆర్ అలా మాట్లాడుతున్నారని తెలుగుదేశం శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రి పీఠం కోసం తాపత్రయపడుతున్నారని ఆయన అన్నారు.
నోరు పారేసుకోవద్దని తెలుగుదేశం పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ కెసిఆర్కు సూచించారు. ఇంకా పార్లమెంటులో బిల్లు ఆమోదించాల్సి ఉందని, ఈ స్థితిలో తొందరపడడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం జరిగిన పోరాటంలో అందరూ పాల్గొన్నారని ఆయన చెప్పారు. కేంద్రం దిగి వచ్చి సమైక్యవాదులతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. తొందరపడితే కెసిఆర్కే లోని పోని సమస్యలు వస్తాయని ఆయన అన్నారు. కెసిఆర్ తీరుపై తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణ నాయుడు కూడా మండిపడ్డారు. హైదరాబాద్ కెసిఆర్ జాగీర్ కాదని ఆయన అన్నారు.
రెచ్చగొట్టే చర్యలను ఖండిస్తున్నామని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి కె. జానా రెడ్డి అన్నారు. సీమాంధ్ర నాయకులు కాంగ్రెసు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడాలని ఆయన కోరారు. అందరూ సంయమనం పాటించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications