బెంగళూర్లో జగన్ ఇల్లు కట్టలేదా, వద్దు: పొన్నం
సీమాంధ్ర ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాము తెలుగు భాషను కాదని పోయేవాళ్లం కాదని, హైదరాబాద్ రావడానికీ పోవడానికీ ఏ విధమైన ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు. మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోయిన తర్వాత అక్కడ లక్షలాది మంది తెలుగువాళ్లు ఉండిపోయారని, జగన్ బెంగళూర్లో ఇల్లు కట్టుకున్నాడని, అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండవచ్చునని ఆయన వివరించారు.
రాష్ట్ర విభజన విషయంలో సంప్రదించలేదు, చర్చించలేదని అనడంలో నిజం లేదని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం పెద్ద యెత్తున జరుగుతున్నప్పుడు కూడా హైదరాబాదులో ఎవరినీ ఏమీ అనలేదని ఆయన గుర్తు చేశారు. తెలుగు మాట్లాడేవారి రాష్ట్రాల ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించవద్దని ఆయన కోరారు. రాజకీయ నాయకులు సృష్టిస్తున్న అపోహలను నమ్మవద్దని ఆయన సీమాంధ్ర ప్రజలను కోరారు.
సమైక్యం పేరుతో మోసం
సమైక్యం పేరుతో సీమాంధ్ర నాయకులు అక్కడి ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఎవరికీ ఏ విధమైన అన్యాయం జరగకుండా ఇంకా చర్చలు జరుగుతాయని, అసెంబ్లీలో తీర్మానం ప్రతిపాదించినప్పుడు చర్చ ఉంటుందని, బిల్లు ప్రతిపాదించిన తర్వాత పార్లమెంటులో మాట్లాడే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలతో పాటు ఇతర పార్టీలతో కూడా చర్చలు జరిపిందని, ఎన్నో సార్లు తమ పార్టీ నాయకులతో అధిష్టానం చర్చలు జరిపిందని, ఎన్నోసార్లు చర్చలు జరిపిన తర్వాతనే చర్చల సారాంశాన్ని క్రోడీకరించి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని నిర్ణయించిందని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని ఆయన కోరారు.