పదేళ్ల తర్వాత వెళ్లాలా?: ఎపిఎన్జీవో, కమిటీపై లగడపాటి
సమ్మెను అన్ని రకాలుగా విస్తరించి, పరిపాలనను అన్ని రకాలుగా స్తంభింపచేస్తామన్నారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం విడిపోతుందనే విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారని, తమ జీతం పోయినా సమైక్య రాష్ట్రం కోసం చివరి వరకు పోరాడుతామన్నారు. పార్లమెంటులో రాజకీయ సంక్షోభం సృష్టించేందుకు సిద్ధమన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టాలని తమకు లేదని, కానీ సమైక్య రాష్ట్రం కోసం తప్పదన్నారు.
సమైక్యంగా ఉంటేనే అన్ని ప్రాంతాల వారికి న్యాయం జరుగుతుందన్నారు. విభజన వల్ల ఒక తరం నష్టపోతుందన్నారు. రాష్ట్ర విభజన రాజకీయ స్వార్థానికి పరాకాష్ట అన్నారు. హైదరాబాదు తమది కాదన్న దాని పైన సీమాంధ్రలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయన్నారు. అన్ని ప్రభుత్వ సంస్థలలోను ఉద్యోగుల మద్దతు తమకు ఉందన్నారు. విభజన అంటూ జరిగితే ముందు నష్టపోయేది ఉద్యోగులు, విద్యార్థులే అన్నారు. రాష్ట్రం విడిపోతే జరిగే నష్టం కంటే సమ్మె ద్వారా జరిగే నష్టమేమీ లేదన్నారు.
ప్రజాప్రతినిధులకు డెడ్ లైన్
ప్రజాప్రతినిధులు ఈ నెల 12వ తేదిలోగా రాజీనామా చేయాలని ఎపిఎన్జీవో డెడ్ లైన్ విధించింది. లేదంటే వారి ఇళ్లను ముట్టడిస్తామని పేర్కొంది. ఇప్పటికే యాభై మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేసినట్లుగా తెలుస్తోందన్నారు. మిగతా కేంద్రమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలన్నారు.
ఇతర పార్టీలకు లగడపాటి సూచన
విభజన జరగాలా వద్దా అన్న దాని పైన సీమాంధ్ర ప్రాంతంలో తమ పార్టీ అధిష్టానం హైలెవల్ కమిటీ వేసిందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మంగళవారం అన్నారు. మిగతా పార్టీలు కూడా కమిటీలు వేసి విభజనపై విస్తృతస్థాయిలో చర్చించాలని సూచించారు. తమ పార్టీ కమిటీకి తమ అభిప్రాయాలు తెలిపేందుకు సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులం మరోసారి భేటీ అవుతామని చెప్పారు.
ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు: జానా రెడ్డి
ఎవరి హత్యకు కుట్ర జరిగినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి అన్నారు. తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు హత్యకు కుట్ర జరుగుతుందన్న వార్తలపై ఆయన స్పందించారు. ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామన్నారు.
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు త్వరలో నిర్వహిస్తామని చెప్పారు. రెండేళ్లుగా ఎన్నికలు నిర్వహించక పోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సిన రెండు వేల కోట్ల రూపాయలు ఆగిపోయాయని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా వాటి కోసం లేఖ రాస్తామని చెప్పారు.