ధర్మాన, సబితలకు ఊరట: తప్పుపట్టలేమన్న కోర్టు
సబిత, ధర్మానలు బయట ఉంటే కేసుపై ప్రభావం పడుతుందని, రాజీనామా చేశాక వారు మీడియాతో మాట్లాడటం అభ్యంతరకరమని సిబిఐ కోర్టులో వాదించింది. అయితే సాక్ష్యులను బెదిరించినట్లు, సాక్ష్యాలు తారుమారు చేసినట్లు ఆధారాలు లేవని, ఈ విషయంలో నిందితులను తప్పు పట్టలేమని కోర్టు పేర్కొంటూ మెమో కొట్టివేసింది. ధర్మాన, సబితలు హర్షం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకముందని, తమకు న్యాయం జరిగిందన్నారు.
కాగా, జగన్ కేసులో ధర్మాన, సబితాల పైన ఛార్జీషీట్ దాఖలు చేసిన సిబిఐ, వారిని జ్యూడిషియల్ కస్టడీకి పంపాలని గతంలో మెమో దాఖలు చేసింది. ఆ మెమోపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు మాజీ మంత్రులను ఆదేశించింది. దీంతో వారు కౌంటర్ దాఖలు చేసిన అనంతరం విచారణ ప్రారంభమైంది.
తమ పేర్లను ఛార్జీషీటులో దాఖలు చేయడంతో మంత్రులుగా ఉన్న వీరు అంతకుముందు రాజీనామాలు చేశారు. ఆ సమయంలో వారు మీడియాతో మాట్లాడారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, నిర్దోషులుగా బయటకు వస్తామని చెప్పారు.
దీంతో సిబిఐ వారిద్దరు మంత్రులుగా పని చేశారని, రాజకీయంగా పలుకుబడి కలిగినవారని, అధికార వర్గాల్లో ప్రాబల్యం ఉందని, ఈ నేపథ్యంలో వారు మాట్లాడిన మాటలు సాక్షుల్ని ప్రభావితం చేస్తాయని, వారిని కస్టడీకి తీసుకుంటామని మెమో దాఖలు చేసింది. ఈ మెమోపై సిబిఐ కోర్టు విచారణ జరిపింది. గత నెల 25వ తేదిన విచారణ ముగిసింది.