ఎందుకు విడిపోవాలి..: ఇంటర్నెట్లో గజల్ పాట హల్చల్
తెలంగాణ, సమైక్య ఉద్యమాలలో ర్యాలీలు, రాస్తారోకోలు, బందులతో పాటు పాటల పాత్ర చాలా ఉంటుంది. తెలంగాణ ఉద్యమంపై, ఉద్యమం జరుగుతున్న కాలంలో ఎన్నో పాటలు వచ్చాయి. ఇటీవలి కాలంలో ప్రజా యుద్ద నౌక గద్దర్... పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... అనే పాట తెలంగాణ ప్రాంతంలో బాగా వినిపించింది. గత వారం రోజులుగా సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం జోరందుకుంది.
ఈ నేపథ్యంలో కొందరు సమైక్యవాద గాయకులు తమ కలానికి పని చెబుతున్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని పాటలు అందుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ గజల్ గాయకుడు, గిన్నిస్ రికార్డ్ హోల్టర్ గజల్ శ్రీనివాస్ రాష్ట్ర సమైక్యంగా ఉండాలని కోరుకుంటూ ఓ పాట పాడారు.
ఎందుకు విడిపోవాలి... అంటూ సిరాశ్రీ రాసిన పాటను పాడారు. సిరాశ్రీ ఈ పాటను గంట వ్యవధిలో రాశారట. యూపిఏ, సిడబ్ల్యూసి విభజనకు అనుకూలంగా తీర్మానం చేశాక.. తమ ఎమోషన్స్ను ఈ పాట రూపంలో చెప్పామని గజల్ శ్రీనివాస్ చెబుతున్నారు. ఈ పాట తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం కాదని లిరిసిస్ట్ సిరాశ్రీ చెప్పారు.
ఈ పాటలో తెలంగాణ ప్రాంత ప్రముఖులు కొమరమ్ భీమ్, రుద్రమ దేవి తదితరులను ప్రస్తావించామన్నారు. విభజనకు సరైన కారణం లేదని, అదే విషయాన్ని పాటలో ప్రస్తావించామన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాటలు ప్రముఖ పాత్ర వహించాయని చెప్పవచ్చు. ఉద్యమ నేపథ్యంలో సినిమాలు కూడా వచ్చాయి.