పరిహారమొద్దు, పాక్ పైన చర్య తీసుకోండి: జవాన్ భార్య
తమకు పరిహారమేమీ వద్దని, భారత సైనికులను చంపిన పాకిస్తాన్కు సైనిక పరంగా ధీటైన సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. ఎన్నాళ్లు పాక్ దాడులను సహిస్తామని ప్రశ్నించారు. పాకిస్తాన్ పైన సైనిక చర్య కన్నా తక్కువేదీ అంగీకరించమన్నారు. కాగా ఈ దాడిలో బీహార్ రాష్ట్రానికి చెందిన వారే నలుగురు ఉన్నారు. దీంతో బీహార్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
పార్లమెంటులో దుమారం
నియంత్రణ రేఖవద్ద పాక్ సైన్యం, ఉగ్రవాద మూక మూకుమ్మడి దాడిలో ఐదుగురు భారత సైనికులు అమరులు కావడంపై రక్షణ మంత్రి ఆంటోనీ ప్రకటన పార్లమెంటులో రాజకీయ దుమారం రేపింది. సదరు ప్రకటన పాకిస్థాన్ ముష్కర సైన్యానికి క్లీన్చిట్ ఇస్తున్నదంటూ బుధవారం కూడా ఉభయసభల్లో విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఇందుకు క్షమాపణ చెప్పాలని ఆయనను నిలదీయడంతో కార్యకలాపాలేవీ సాగలేదు.
కాగా, పాక్ సైనిక దుస్తుల్లో ఉన్న వ్యక్తులతో కలసి ఉగ్రవాదులు ఈ దాడి చేశారు' అని మంగళవారం ఆంటోనీ సభలో ప్రకటించారు. చేసిన తప్పునుంచి పాక్ తప్పించుకునేందుకు అవకాశం ఇచ్చేలా ఈ ప్రకటన ఏమిటని లోక్సభలో బిజెపి పక్ష నేత సుష్మా స్వరాజ్ నిలదీశారు. పాక్ సైన్యం సాయంతో ఉగ్రవాదలు దాడి చేసినట్లు జమ్మూలో ఆర్మీ చేసిన ప్రకటనను మార్చేసి, సభకు భిన్న సమాచారం ఇవ్వడం శోచనీయమన్నారు.
మరోవైపు యశ్వంత్ సిన్హా ఆయనపై హక్కుల తీర్మానం ఇచ్చారు. దీన్ని పరిశీలిస్తున్నట్లు స్పీకర్ మీరా కుమార్ ప్రకటించారు. సభ ఉదయం తొలిసారి వాయిదాపడినప్పుడు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్తో బిజెపి అగ్రనేత అద్వానీతో మాట్లాడారు. ఆంటోనీ వైఖరిపై ఆయన ఆగ్రహం వెలిబుచ్చారు. రాజ్యసభలోనూ బిజెపి నేత వెంకయ్య ప్రభుత్వంపై మండిపడ్డారు. సైనికదళాల ఆత్మస్థయిర్యాన్ని సర్కారు దెబ్బతీస్తున్నదని ఆరోపించారు.