పరిష్కారం చూపిస్తాం!: కిరణ్కు డిగ్గీ, నో పాలిటిక్స్... జెపి
కిరణ్ లేవనెత్తిన అభ్యంతరాలపై కమిటి దృష్టి పెడుతుందన్నారు. అన్ని వర్గాలతో చర్చలు జరుపుతుందని చెప్పారు. ఆంటోనీ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీని వేసింది.. సమస్యల పైన దృష్టి సారించి వాటిని పరిష్కరించేందుకేనని దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు.
రాజకీయాలు పక్కన పెట్టండి: జెపి
రాజకీయాలు పక్కన పెట్టి అందరికీ సమన్యాయం జరిగేలా చూడాలని, సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ హైదరాబాదులో అన్నారు. అన్ని ప్రాంతాల కంటే రాయలసీమ ప్రాంతం వెనుకబడి ఉందన్నారు. రాయలసీమలో ఒక మహానగరాన్ని అభివృద్ధి చేయకుంటే మళ్లీ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశముందన్నారు. రాయలసీమ యువతకు భవిష్యత్తుపై హామీ కావాలన్నారు.
రాష్ట్రానికి హైదరాబాద్ నగరం తలమానికమన్నారు. అందరం కలిసి చర్చిస్తే సమస్య పరిష్కారమవుతుందన్నారు. అందరికి న్యాయం జరిగేలా ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని హితవు పలికారు. రాజకీయంగా నష్టపోయినా ప్రజలకు మంచి జరిగేలా చూడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల పైన ఉందన్నారు. ప్రజల బతుకులను బలిపెట్టి రాజకీయాల్లో లబ్ధి పొందాలనుకోవడం ఏమాత్రం సరికాదన్నారు.
విభజన నిర్ణయం వ్యతిరేకిస్తున్నా: పితాని
సిడబ్ల్యూసి తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని సాంఘికం సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా అచంటలో అన్నారు. సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని పితాని సందర్శించి, సంఘీభావం తెలిపారు.
ప్రజల అభీష్టం మేరకే తాము సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. ఉద్యమంలో పాల్గొంటామన్నారు. సీమాంధ్రుల అభిప్రాయాలను చట్టసభలలో వినిపించి విభజన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేలా తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.