కిరణ్ రెడ్డి ధిక్కారం: అవసరమైతే రాష్ట్రపతి పాలన?
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఒక ఉన్నతాధికారి ఇప్పటికే దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. "కేంద్రాన్ని ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉండండి. అవసరమైతే స్వతంత్ర నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది'' అని వారికి సూచించినట్లు ఆ వార్తాకథనాలు తెలియజేస్తున్నాయి.
ఆహార భద్రత బిల్లుపై ఓటింగ్, తర్వాత తెలంగాణపై చకచకా చర్యలు తీసుకోవాలని అధిష్ఠానం యోచిస్తోంది. ఈనెల 15న అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా రాష్ట్రాన్ని కోరే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యమంత్రి ధిక్కరించినా, ఇతర ప్రజా ప్రతినిధులు రాజీనామా చేసినా కొత్త ముఖ్యమంత్రిని నియమించేందుకు ప్రయత్నిస్తారని, అది కుదరకపోతే రాష్ట్రపతి పాలన విధించక తప్పదని, అసెంబ్లీని త్రిశంకు స్వర్గంలో (సస్పెండెడ్ యానిమేషన్లో) ఉంచి, తెలంగాణ బిల్లును రూపొందించిన తర్వాత మళ్లీ అసెంబ్లీని పునరుద్ధరించి అభిప్రాయం కోరతారని, ఈలోపు పరిస్థితులు సద్దుమణిగే అవకాశాలున్నాయని అంటున్నారు..
సీమాంధ్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందని, హైదరాబాద్ను పదేళ్లు అని మాత్రమే కాకుండా, అవసరమైనంత వరకు ఉమ్మడి రాజధానిగా ఉంచే విషయం పరిశీలిస్తామని కేంద్ర నేత ఒకరు తెలిపినట్లు వార్తలు వచ్చాయి. కాగా తెలంగాణ అంశంపై హోంమంత్రి షిండే సోమవారం పార్లమెంటులో ఒక ప్రకటన చేయవచ్చు.