హైదరాబాద్ను మారిస్తే సహించం, టీదే: పాల్వాయి
కొద్ది పెట్టుబడిదారులు కుట్రలో భాగంగానే హైదరాబాద్ కోసం పట్టుపడుతున్నారని ఆయన విమర్శించారు. సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు ప్రజలను మభ్యపెట్టి వారిలో అనవసరమైన అపోహలు కలిగేలా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. హైదరాబాదును తామే అభివృద్ధి చేశామనే మాటలను సీమాంధ్ర నాయకులు మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
సీమాంధ్ర నేతల కుట్రలను బయటపెట్టేందుకే ఇక్కడి కాంగ్రెసు నాయకులు మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని ఆయన అన్నారు. కేంద్రం వెంటనే పార్లమెంటులో బిల్లు పెట్టి ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య సామరస్యపూర్వక వాతావరణం నెలకొనేలా చూడాలని ఆయన కోరారు. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో కాంగ్రెసు ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, కెఆర్ అమోస్ కూడా పాల్గొన్నారు.
తెలంగాణపై ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఎల్లుండి సీఎంపై హైకమాండ్కు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డిలో విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఇవ్వకపోతే 2014 ఎన్నికల్లో పోటీ చేయబోనని తాను చెప్పినట్లు ఆయన తెలిపారు.
ఇదిలావుంటే, కేంద్ర మంత్రి జైపాల్రెడ్డితో మంత్రులు జానారెడ్డి, శ్రీధర్బాబు, సుదర్శన్రెడ్డి శనివారం ఉదయం సమావేశమయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితో మంత్రులు బొత్స, గంటా, విశ్వరూప్ భేటీ అయ్యారు.