మోడీతో బాలకృష్ణ భేటీ, చిరు బావమరిది అల్లు కూడా
మోడీని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బావమరిది బాలకృష్ణ కలుసుకోవడం చర్చనీయాంశమైంది. రానున్న ఎన్నికలలో బిజెపితో పొత్తుపై తెలుగుదేశం పార్టీలో చర్చ సాగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ, మురళీ మోహన్లు కలుసుకున్నారు. అయితే గతంలో మోడీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి బాలయ్యకు ఆహ్వానం అందింది. పార్టీలో భిన్న స్వరాలు వినిపించడంతో బాలకృష్ణ అప్పుడు హాజరుకాలేదు. దీంతో ఇప్పుడు మర్యాదపూర్వకంగా హాజరైనట్లు చెబుతున్నారు. అదే సమయంలో బాలకృష్ణ తన చిన్న కూతురు పెళ్లికి మోడీని ఆహ్వానించారు.
వచ్చే ఎన్నికలలో బిజెపితో పొత్తుపై పార్టీలో చర్చ సాగుతుందని టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావు చెప్పారు. బిజెపి తెలంగాణ అంటోందని, తాము కూడా తెలంగాణ అంటున్నామని మోడీ పట్ల యువతలో కొంత ఆకర్షణ ఉందని, తమ రెండు పార్టీలూ కలిస్తే రెండు ప్రాంతాల్లోనూ తేలిగ్గా అధికారంలోకి రాగలమన్న అభిప్రాయం పార్టీలో కొందరిలో ఉందని, దీనిపై చర్చిస్తున్నామని ఎర్రబెల్లి చెప్పారు.
అయితే, అలాంటి చర్చే పార్టీలో లేదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపి కంభంపాటి రామ్మోహన రావు తెలిపారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలపై విలేకరులు ప్రశ్నించినప్పుడు ఆయన ఈ మాట అన్నారు. ఇప్పుడేమీ ఎన్నికలు లేవని, పొత్తుల గురించి ఆలోచన చేయడానికి ఇంకా చాలా సమయం ఉందని, తనకు తెలిసి పార్టీలో దీనిపై ఏ చర్చా జరగలేదని, సమయం వచ్చినప్పుడు పార్టీ నాయకత్వం, పొలిట్బ్యూరో దీనిపై నిర్ణయం తీసుకుంటాయని, ఎర్రబెల్లి ఎందుకలా మాట్లాడారో ఆయననే అడగాలని చెప్పారు.