విభజన: ఢిల్లీకి చంద్రబాబు, వెంట ఇరు ప్రాంతాల నేతలు
ఆయనతోపాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐదుగురు నేతలు, సీమాంధ్ర పాంత్రానికి చెందిన ఐదుగురు నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. ఉభయ ప్రాంతాల నేతలతో ఆదివారం ఇక్కడ తన నివాసంలో సమావేశమైన బాబు ఢిల్లీ యాత్రపై వారి అభ్రిపాయాలు తెలుసుకున్నారు. బాబు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తదితరులను కలిసే అవకాశముంది.
కాగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై బాబు ఇప్పటికే ప్రధానికి ఒక లేఖ రాసిన విషయం తెలిసిందే. ముందుగా ప్రభావిత వర్గాలతో సంప్రదింపుల ప్రక్రియను చేపట్టకుండా విభజన నిర్ణయం తీసుకోవడం వల్లే సీమాంధ్రలో తీవ్రస్థాయిలో ఉద్యమం జరుగుతోందని ఆ లేఖలో పేర్కొన్నారు. అంటోని కమిటీని వేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని, అది కేవలం కాంగ్రెస్ పార్టీ అంతర్గత కమిటీ మాత్రమేనని ఆయన ఆ లేఖలో అభిప్రాయపడ్డారు.
ఇదే కోణంలో ఆయన ఢిల్లీలో ప్రధాని తదితరులను కలిసి వివరించే యోచనలో ఉన్నట్లు సమాచారం. తాను మాట మార్చానన్న అభిప్రాయానికి తావు లేకుండా చూసుకునే నిమిత్తం ఆయన తనతో తెలంగాణ ప్రాంత నేతలను కూడా తీసుకు వెళుతున్నారు. తాము విభజన నిర్ణయాన్ని ప్రశ్నించడంలేదని, కానీ విభజన చేసే ముందు సీమాంధ్రుల అవసరాలు, సమస్యలపై చర్చించకుండా హడావిడిగా నిర్ణయం ప్రకటించడాన్ని ఆయన తన ఢిల్లీ పర్యటనలో తప్పుపట్టనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ముందుగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వివిధ వర్గ్గాలతో సంప్రదింపులు జరిపి, వారికి తామేం ఇవ్వబోతున్నామన్న దానిపై స్పష్టత ఇచ్చి ఉంటే ఈ వివాదం తలెత్తిది కాదనేది బాబు వాదన. సంప్రదింపుల ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్యంలో కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరపాలని కూడా ఆయన కోరనున్నారు. ఢిల్లీలో తన వాదనకు లభించే ప్రతిస్పందనను బట్టి ఆయన తన తదుపరి కార్యచరణను రూపొందించుకునే అవకాశముంది.