విభజన: సచివాలయానికి తొలిసారి కిరణ్, సమైక్య సెగ
మంత్రులు రాజీనామా
మంత్రులు కొండ్రు మురళి, శత్రుచర్ల విజయరామరాజులు సోమవారం తమ పదవులకు రాజీనామా చేశారు. సమైక్యాంధ్ర కోసం... ప్రజాభీష్టం మేరకు తాము రాజీనామాలు చేశామన్నారు. బిజెపి, టిడిపి, సిపిఐ విభజనపై నిర్ణయం మార్చుకుంటే తమ పార్టీ అధిష్టానం మార్చుకునేలా తాము చేస్తామన్నారు.
అన్యాయం తట్టుకోలేకే: ఎపిఎన్జీవో
విభజన ద్వారా సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని ఎపిఎన్జీవోలు అన్నారు. తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేకే తాము సమ్మెకు ఉపక్రమించామన్నారు. తాము మొదట పౌరులమని ఆ తర్వాతనే ఉద్యోగులమన్నారు. తమకు ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదన్నారు. రేపటి సమ్మె నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదన్నారు. సమాజానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమన్నారు.
అభివృద్ధిలో సీమాంధ్రులకు వాటాలేదనే వాదనను తాము అంగీకరించమన్నారు. ఒక జట్టు ఓడింది, మరో జట్టు గెలిచిందన్న తీరులో కాకుండా అందరు గెలిచేలా సమస్యను పరిష్కరించాలన్నారు. విభజనపై నిర్ణయాన్ని ఉపసంహరిస్తేనే సీమాంధ్రులకు న్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరును తాము గర్హిస్తున్నామన్నారు. దివంగత ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలకు భిన్నంగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వెళ్తున్నారన్నారు.
కేంద్రం పెద్దన్నలా వ్యవహరించి సమస్యను పరిష్కరించాల్సింది పోయి జఠిలం చేస్తోందన్నారు. ఈ రోజు అర్ధరాత్రి నుడి తాము సమ్మె చేపట్టనున్నట్లు చెప్పారు. ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొంటారన్నారు. రాజకీయ నాయకులు తమ పదవులకు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.