వైయస్ జగన్కు ఝలక్: కాంగ్రెసులోకి నటుడు శ్రీహరి
ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా హైదరాబాదులోని చంచల్గూడ జైలులో ఉన్న జగన్ను కలిసిన శ్రీహరి త్వరలో తాను వైయస్సార్ కాంగ్రెసులో చేరతానని ప్రకటించారు కూడా. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు మారిపోవడం, సమైక్యాంధ్రకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జై కొట్టడంతో తెలంగాణలో ఆ పార్టీ దాదాపు ఖాళీ అయిపోయింది. ఈ నేపథ్యంలో శ్రీహరి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఆగస్టు 15న తన జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని ఆయన తేల్చిచెప్పారు. కూకట్పల్లి నియోజకవర్గం నుంచి బరిలో నిలవాలని ఆయన భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు చిత్రసీమ మాత్రం విడిపోదనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
చిత్రసీమలో ఆంధ్ర, తెలంగాణ భేదాలున్నాయని తాను అనుకోవడంలేదనీ, తాను తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తినైనా తనపట్ల ఎవరూ వివక్షతో వ్యవహరించలేదని ఆయన స్పష్టం చేశారు. "నాకు పనే ముఖ్యం. సినిమా రాజకీయాలు నాకు తెలీదు. దాసరి నారాయణరావు, కె. రాఘవేంద్రరావు, ఎ. కోదండరామిరెడ్డి, చిరంజీవి, మోహన్బాబు, బాలకృష్ణ వంటి వ్యక్తులు నన్ను బాగా ప్రోత్సహించారు'' అని తెలిపారు.