భారత పౌరుడుకాదు: టిఆర్ఎస్ ఎమ్మెల్యేకి హైకోర్టు షాక్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు బుధవారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో చుక్కెదురయింది. ఎమ్మెల్యే రమేష్ భారత పౌరుడు కాదని న్యాయస్థానం తీర్పు చెప్పింది. తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చినందున ఆయన ఎన్నిక చెల్లదని చెప్పింది.
ఆయన ద్వంద్వ పౌరసత్వం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన విచారణ ప్రక్రియను నిలుపుదల చేస్తూ అంతకుముందు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రెండేళ్ల క్రితం ఎత్తివేసింది. ద్వంద్వ పౌరసత్వంపై విచారణ జరిగింది. విచారణ అనంతరం చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని న్యాయస్థానం ఇప్పుడు తీర్పు చెప్పింది.
కాగా, ప్రొఫెసర్గా జర్మనీలో స్థిరపడిన రమేష్ భారత ప్రభుత్వానికి ఏడాది కాలం ఇండియాలోనే ఉన్నట్లు తప్పుడు నివేదికలు సమర్పించి ఇక్కడి పౌరసత్వం పొందారని పేర్కొంటూ ఆది శ్రీనివాస్ అనే అతను కేంద్ర హోంశాఖకు 2009లో ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్ర హోంశాఖ ఎమ్మెల్యే రమేష్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
తన పౌరసత్వంపై హోంశాఖ విచారణను నిలిపివేయించాలని కోరుతూ రమేష్ ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించడంతో స్టే విధించారు. దీంతో విచారణపై స్టే ఎత్తివేయాలని కోరుతూ ఆది శ్రీనివాస్ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు గతంలో విధించిన స్టేను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టు స్టే ఎత్తివేయడంతో రమేష్ పౌరసత్వంపై హోంశాఖ విచారణ జరిపి, అతను భారత పౌరుడు కాదని తీర్పు ఇచ్చింది. 2010 ఉప ఎన్నికలకు ముందు రమేష్ టిడిపికి రాజీనామా చేసి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.