వైయస్ విజయమ్మతో భేటీ: దీక్షకు ఎపి ఎన్జీవోల మద్దతు
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయవాడలో తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు ఎపి ఎన్జీలో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు మద్దతు ప్రకటించారు. ఎపి ఎన్జీవోలు గురువారం విజయమ్మతో సమావేశమయ్యారు. విజయమ్మకు ఎపి ఎన్జీవోలు మద్దతు ఇస్తున్నట్లు అశోక్ బాబు భేటీ అనంతరం చెప్పారు. సమైక్యాంధ్ర కోసం తాము చేస్తున్న పోరాటానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతు ఇస్తోందని ఆయన చెప్పారు.
రాష్ట్ర విభజన రాజకీయ ప్రయోజనాల కోసమేనని, రాష్ట్రాన్ని విభజించే అధికారం కేంద్రానికి లేదని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్బాబు వ్యాఖ్యానించారు. గురువారం హైదరాబాద్లో ఏపీ ఎన్జీవోల సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని భేటీలో తీర్మానించినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన ప్రకటన చేస్తూ కాంగ్రెస్ చారిత్రాత్మకమైన తప్పు చేసిందని ఆయన అన్నారు.
రాష్ట్రం సమైక్యంగా ఉండడంవల్ల కలిగే ప్రయోజనాలను అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు వివరించాలని అశోక్బాబు కోరారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఏర్పాటు చేస్తామని, త్వరలో హైదరాబాద్లో లక్ష మందితో కూడిన బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 23 జిల్లాల్లో సమైక్యవాదులు ఉన్నారని వారంత సభకు హాజరవుతారని అన్నారు.
రాజధానిని రెండు రాష్ట్రాలకు పంచే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. తెలంగాణవాదం లేదనడానికి 2009 ఎన్నికలో నిదర్శనమని ఆయన అన్నారు. గురువారం జరిగిన కార్యక్రమంలో ఉద్యోగ, ప్రజాసంఘాల నేతలు, రాజకీయ నేతలు పాల్గొన్నారని అశోక్బాబు తెలిపారు.