తెలంగాణ నోట్: హైదరాబాద్ శాంతిభద్రతలు కేంద్రానికే
న్యూఢిల్లీ: తెలంగాణపై మరింత వేగంగా ముందుకు వెళ్లాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది. పార్టీ నాయకుల్లో ఏర్పడిన అపోహలను తొలగించడానికి ఏర్పాటైన ఎకె ఆంటోనీ కమిటీ పనిచేయడం ప్రారంభించింది. బుధవారం రాత్రి తెలంగాణ నాయకులు ఆంటోనీ కమిటీతో సమావేశమయ్యారు. హైదరాబాదులోని సీమాంధ్రులకు పూర్తి భద్రత ఉంటుందని తెలంగాణ నాయకులు ఆంటోనీ కమిటీకి చెప్పారు. హైదరాబాదు శాంతిభద్రతలను కేంద్రం తన చేతుల్లో ఉంచుకోవడానికి తమకు ఏ విధమైన అభ్యంతరం లేదని వారు కమిటీకి చెప్పారు.
కాగా, తెలంగాణపై రూపొందించాల్సిన కేబినెట్ నోట్ను పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా తయారు చేయాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. కేబినెట్ నోట్పై పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చ జరుగుతుందని కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఆంటోనీ కమిటీ ఎప్పటి వరకూ పనిచేయాలన్న విషయంపై కూడా అధిష్ఠానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో బిల్లు చర్చకు వచ్చేదాకా ఆంటోనీ కమిటీ ద్వారా అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ప్రభుత్వం తరఫున మరో కమిటీ అవసరం లేదని, ఆంటోనీ కమిటీని ఎవరైనా కలుసుకోవచ్చునని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్సింగ్ తెలిపారు. ఆంటోనీ కమిటీని కలవలేని వారు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిసి తమ అభిప్రాయాలు చెప్పవచ్చునని అన్నారు. ఆంటోనీ కమిటీని కలుసుకునేందుకు సందేహించే ఇతర రాజకీయ పార్టీలకు అసెంబ్లీలోనూ, పార్లమెంట్లోనూ తెలంగాణ బిల్లు చర్చకు వచ్చినప్పుడు తమ అభ్యంతరాలు తెలిపే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం మరో కమిటీని నియమించినా తమకు అభ్యంతరం లేదన్నారు.
రాష్ట్రంలో పరిస్థితులు ఏమీ మారలేదని, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం 2014 వరకు అధికారంలో ఉండాలని ప్రజలు తీర్పు ఇచ్చారని... శాంతి భద్రతలను ప్రస్తుత ప్రభుత్వమే అదుపులో పెడుతుందని దిగ్విజయ్ చెప్పారు. పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చవద్దని, సంయమనం పాటించాలని, రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని ఇరు ప్రాంతాల నేతలకు చెప్పానని ఆయన తెలిపారు.