క్షీణిస్తున్న వాణి ఆరోగ్యం: శైలజానాథ్ భార్య పరామర్శ
వాణి దీక్షను పోలీసులు భగ్నం చేసే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. బుధవారం రాత్రి కూడా ఇటువంటి ప్రచారం సాగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఘర్షణపూరిత వాతావరణం చోటు చేసుకుంది. కాగా, వాణిని రాయలసీమకు చెందిన మంత్రి శైలజానాథ్ సతీమణి మోక్ష పరామర్శించారు. దీక్ష విరమించాలని ఆమె వాణిని కోరారు.
వాణి తనకు స్నేహితురాలని, గత ఆరేళ్లుగా తమ మధ్య పరిచయం ఉందని, దాంతో ఆమెను పలకరించడానికి, ఆమె దీక్షకు సంఘీభావం తెలపడానికి వచ్చానని మోక్ష చెప్పారు. నాయకులతో సంబంధం లేకుండా సీమాంధ్ర ప్రజలు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నారని ఆమె చెప్పారు. ఏకపక్షంగా జరిగిన విభజన నిర్ణయం వల్ల అన్యాయం జరుగుతోందని ఆమె విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కూడా విభజన నిర్ణయం జరగలేదని ఆమె అన్నారు. విభజన నిర్ణయంపై మరోసారి ఆలోచించాలని ఆమె కాంగ్రెసు అధిష్టానాన్ని కోరారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాము గవర్నర్ను కోరామని, తాము ముఖ్యమంత్రిని కూడా కలుస్తామని మోక్ష చెప్పారు. ఎకె ఆంటోనీ కమిటీని కూడా తాము కలుస్తామని, తాము అపాయింట్మెంట్ అడిగామని ఆమె చెప్పారు. ఆంటోనీ కమిటీని కలిసి తమకు న్యాయం చేయాలని కోరుతామని ఆమె చెప్పారు.