టీ ఆపేది కాదు: ఆంటోనీ, నమ్మకం ఉంది: చిరంజీవి
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రక్రియ ఆపేది కాదని రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనీ సీమాంధ్ర కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులతో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు గురువారం రాత్రి ఆంటోనీ కమిటీతో గంటన్నరకు పైగా సమావేశమయ్యారు. తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని సమావేశానంతరం కేంద్ర మంత్రి చిరంజీవి చెప్పారు. సీమాంధ్రలో పరిస్థితులను తాము వివరించామని, దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వస్తానని చెప్పారని కేంద్ర మంత్రి పళ్లంరాజు చెప్పారు.
విభజనను ప్రస్తుతానికి ఆపాలని కేంద్ర మంత్రులు, ఎంపీలు ఆంటోనీ కమిటీని కోరారు. రాష్ట్ర విభజనపై రెండో ఎస్సార్సీ వేయాలని సూచించినట్లు సమాచారం. అయితే తెలంగాణ ప్రక్రియ ఆపేది కాదని ఆంటొనీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీక్ష విరమించాలని దిగ్విజయ్ సింగ్ తోట నర్సింహం సతీమణి వాణికి విజ్ఝప్తి చేశారు. వాణికి దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.
అన్ని సమస్యలనూ ఆంటొనీ కమిటీకి వివరించామని, న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని చిరంజీవి అన్నారు. విభజన ప్రక్రియ ఫలితంగా ఏర్పడబోయే సమస్యల గురించి చెప్పాలనుకునేవారు ఢిల్లీ వచ్చి ఆంటొనీకి కమిటీకి సమస్యలు వివరించవచ్చునని ఈ సమావేశం ముగిసిన అనంతరం దిగ్విజయ్ చెప్పారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.
సీమాంధ్రలో రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమం కొనసాగిస్తున్నారని, అక్కడ ఉద్యమం జరుగుతున్న తీరును సీమాంధ్ర మంత్రులు ఆంటొనీ కమిటీకి వివరించారు. విభజన తప్పదంటే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని వారు కోరారు. నాయకులు ఎవరూ పాల్గొనడంలేదని, ఇది ప్రజల ఉద్యమం అని, ఇంకా ఈ ఉద్యమం కొన్నాళ్లు కొనసాగుతుందని వారు వివరించినట్టు తెలుస్తున్నది.
ఆంటోనీ కమిటీతో సమావేశమైనవారిలో కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, పురందేశ్వరి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కిశోర్ చంద్రదేవ్, పనబాక లక్ష్మి, పళ్లంరాజు, జేడీ శీలం తదితరులు ఉన్నారు. రేణుకా చౌదరి, చింతా మోహన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు