తిరుమలకు మళ్లీ బస్సులు బంద్: హుండీకి గండి
అయితే, ప్రభుత్వ విజ్ఝప్తితో తిరుమలకు బస్సులను నడపడానికి అంగీకరించారు. ఆర్టీసి ఉద్యోగులకు టాక్సీ డ్రైవర్ల సంఘం కూడా మద్దతు తెలిపింది. తిరుమలకు టాక్సీలను నడపబోమని సంఘం ప్రకటించింది. తిరుమలకు బస్సులను నడపవద్దని ఆర్టీసి జెఎసి ప్రైవేట్ బస్సు ఆపరేటర్లను హెచ్చరించింది. అయితే, తిరుమలకు బస్సులు నడపకూడదని తుది నిర్ణయం తీసుకోలేదని ఆ తర్వాత ఆర్టీసి సంఘాలు తెలిపాయి. అన్ని కార్మిక సంఘాల నేతలు సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు.
శనివారం నుంచి తిరుమల పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఆర్టీసి ఉద్యోగుల నిర్ణయంతో ఉత్సవాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. తిరుమలకు రైళ్లలో వచ్చే భక్తులు గానీ, ఇతర భక్తులు గానీ కాలి నడకనే తిరుమలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే తిరుమలకు భక్తుల రాక విపరీతంగా తగ్గిపోయింది. శ్రీవారి హుండీపై ఇది తీవ్రమైన ప్రభావం వేసింది.
ఎప్పుడూ రద్దీగా ఉండే కలియుగ వైకుంఠ స్వామి నిలయమైన తిరుమల వెలవెలబోతోంది. భక్తుల తాకిడి లేకపోవడంతో శ్రీవారి దర్శనం కేవలం ఒక్క గంటకే పూర్తయిపోతోంది. ఫలితంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ. కోటికి తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అధికారులు చెబుతున్నారు.
మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన హుండీ లెక్కింపులో ఒకే రోజున భక్తులు రూ.1.40 కోట్లు కానుకగా సమర్పించారు. అయితే గత ఐదు నెలలో ఐదే అతి తక్కువ హుండీ ఆదాయమని టిటిడి అధికారులు వెల్లడించారు. మూడు రోజుల పాటు సాగే శ్రీవారి పవిత్రోత్సవాల సమయంలో సుప్రభాతసేవలు మినహా అన్ని రకాల అర్జిత సేవలను రద్దు చేసిననట్టు టిటిడి అధికారులు వెల్లడించారు.