దూళిపాళ్ల నిరాహార దీక్ష: బస్సు నడిపిన మాగంటి
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా కర్నూలు జిల్లాలో నాలుగో రోజు కూడా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఏపీ ఎన్జీవోలు ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మానవహారం చేపట్టారు. ప్రభుత్వ వైద్యులు ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ జేఏసీ నేతలు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. వైద్య ఆరోగ్య ఉద్యోగులు భిక్షాటన చేసి తమ నిరసనను తెలిపారు.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన ఏపీఎన్జీవోలు శనివారం ఉదయం విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ నివాసం ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ విశాఖపట్నంలో సమైక్య వాదుల నిరసనలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం జగదాంబ జంక్షన్ వద్ద జర్నలిస్టులు మానవహారం నిర్వహించారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో శనివారం ఉదయం ఆర్టీసీ ఉద్యోగులు బస్సు ర్యాలీ చేపట్టారు. తెలుగుదేశం పార్టీ నేత నేత మాగంటిబాబు బస్సు నడిపి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఏలూరులో పంచాయితీరాజ్ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు రాస్తారోకో నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పాలకొల్లులో సమైక్యవాదులు సింహాసనంపై శునకాన్ని కూర్చోబెట్టిన క్షీరాభిషేకం చేశారు.