ఆంటోనీ చెప్తే సోనియా ఓకే: రాయల టిపై పునరాలోచన!
అయితే, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పది జిల్లాల తెలంగాణ మాత్రమే ఇవ్వాలని, మరో మాటకు తావులేదని స్పష్టం చేయడంతో సీన్ మారిపోయిందట. సిడబ్ల్యూసి తీర్మానం, ప్రకటన కూడా ఆ ప్రకారమే జరిగిపోయాయి. ఆ వెంటనే సీమాంధ్ర భగ్గుమంది. దీంతో సీమాంధ్రుల సమస్యలు చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆంటోనీ కమిటీని నియమించింది. దీంతో కర్నూలు, అనంతపురం జిల్లాలతో కూడిన రాయల తెలంగాణ ఏర్పాటు దిశగా ఆలోచించేలా ఒక బలమైన వర్గం ప్రయత్నాలు మొదలు పెట్టిందట.
ఆంటోనీ మాటపై సోనియాకు ఎంతో గౌరవం. దీంతో ఆంటోనీ ద్వారా రాయల టి మాట వినిపించాలని భావిస్తున్నారట. రాయల తెలంగాణ వల్ల నదీ జలాల పంపిణీ సమస్య కూడా పరిష్కారమవుతుందని అధిష్ఠానం తొలి నుంచి భావిస్తోంది. దీంతో పాటు, హైదరాబాద్తో తమ అనుబంధం కొనసాగుతున్న దృష్ట్యా ఈ ప్రతిపాదనకు అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలూ అంగీకరిస్తారనే అభిప్రాయంలో అధిష్ఠానం ఉన్నదంటున్నారు.
గ్రేటర్ రాయలసీమ అనే డిమాండ్ కూడా తెర వెనక్కి వెళుతుందని భావిస్తున్నారు. రాజధానిని త్యాగం చేసి ఇప్పటికే ఒకసారి నష్టపోయామని, విభజనతో రాయలసీమ ఎడారి అవుతుందని, ఆ తర్వాత కోస్తాతో కలిసి ఉండలేమనే వాదనను రాయలసీమకు నేతలు ఢిల్లీ పెద్దలకు పలుమార్లు విన్నవించారు. ఈ నేపథ్యంలో రాయల తెలంగాణ ప్రకటనతో వారు శాంతిస్తారని భావిస్తున్నారు. రెండు జిల్లాలు అదనంగా వచ్చి చేరితే తమకేమీ ఇబ్బంది లేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా చెప్పారని అంటున్నారు.
మరోవైపు రాయల తెలంగాణతో సమస్యలు పరిష్కారమవుతాయనుకోవడం సరికాదని మరికొందరు చెబుతున్నారు. ఎందుకంటే సీమను ముక్కలు చేయాలనే ఆలోచనపై ఆ ప్రాంత నేతలు కొందరు మండిపడుతున్నారు. మరి, రాయల తెలంగాణ అంటే మరో అస్థిత్వ ఉద్యమానికి బీజం వేయడం కాదా? ఒకవేళ రాయల తెలంగాణకు అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలు అంగీకరించినా మిగిలిన 11 జిల్లాల్లో జరుగుతున్న ఉద్యమం ఎలా చల్లారుతుంది?
అయితే, రాయల తెలంగాణను కోరే వారు కూడా లేకపోలేదు. మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి, కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తదితరులు రాయల టికి మద్దతు పలుకుతున్నారు. ఇక, పది జిల్లాల తెలంగాణ తప్ప మరేదీ అక్కర్లేదంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి మాటేమిటి? రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న బిజెపి మద్దతు లేకుండా బిల్లు ఆమోదం పొందడం కూడా కష్టమేనని చెప్పవచ్చు.